ఇవే నా చివరి ఎన్నికలు: సిద్ధూ, బీజేపీకి 130 సీట్లు ఖాయం.. సీఎం 100 శాతం ఓడిపోతారు: యెడ్డీ
బెంగళూరు: ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ రాదని, హంగ్ వస్తుందని ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన అంశంపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు వట్టివేనని అభిప్రాయపడ్డారు.
కర్నాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? చూడండి
ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పార్టీ కార్యకర్తలకు,న ేతలకు, మద్దతుదారులకు ఎవరికీ ఆందోళన అవసరం లేదని, రెండు రోజుల పాటు ఎగ్జిట్ ఫోల్ ఫలితాలతో ఆనందిస్తారని వ్యాఖ్యానించారు. ఆయన ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మీ అభిప్రాయాలతో వారాంతాన్ని ఆనందంగా గడపండి, మేం మళ్లీ అధికారంలోకి వస్తాం అని ట్వీట్ చేశారు.
బీజేపీయే గెలుస్తుందన్న యెడ్యూరప్ప వ్యాఖ్యలపై సిద్ధూ స్పందిస్తూ.. మానసికంగా డిస్టర్బ్ అయ్యారని చెప్పారు. ఇవే తన చివరి ఎన్నికలను, అయితే రాజకీయాల్లో మాత్రం ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. దళితుడిని సీఎంగా చేసినా తనకు సమ్మతమే అన్నారు.
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ: యెడ్యూరప్ప
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆ పార్టీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప అన్నారు. అన్ని ప్రాంతాలలో తమదే ఆధిక్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. తమకు ఎవరి మద్దతు అవసరం రాదని, స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు.
బీజేపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారు. చాముండేశ్వరి, బాదామిలలో సిద్ధరామయ్య ఓడిపోవడం వంద శాతం ఖాయమన్నారు. ఈ నెల 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, ప్రమాణ స్వీకారం తేదీ ఫిక్స్ చేసుకొని వస్తానని చెప్పారు. 24 గంటల్లో రైతు రుణాలు రద్దు చేస్తామన్నారు.