'భయమొద్దు, సరిపోయే కరెన్సీ ఉంది', రూ.100 నోట్లే లంచం ఇవ్వాలని..!
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లు మార్పించుకునేందుకు జనాలు బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఏటీఎంల వద్ద క్యూ కట్టినా అవి పని చేయడం లేదు. తమ వరకు చెల్లుబాటు అయ్యే కరెన్సీ వస్తుందో లేదోనని జనాలు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) దీని పైన స్పందించింది. కొత్త నోట్లు సరిపడా ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ప్రజలు సహనంతో ఉండాలని, అందరికీ సరిపడా కొత్త నోట్లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్బీఐ తెలిపింది.
లంచం వంద నోట్లలోనే ఇవ్వాలన్న అధికారి అరెస్ట్
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిని చాలామంది తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో ఓ అధికారి తనకు లంచం ఇవ్వాలని, అది కూడా రూ.100 నోట్లే ఇవ్వాలని షరతు పెట్టాడు. అతనిని అధికారులు అరెస్ట్ చేశారు.
సోలాపూర్ జిల్లాలోని మోహోల్ పంచాయత్ సమితికి చెందిన వ్యవసాయ శాఖాధికారి బాలాసాహెబ్ భికాజీ బాబర్ గురువారం ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
కృషి సేవా కేంద్రం ప్రతిపాదనకు అంగీకారం తెలిపేందుకు బాలాసాహెబ్ లంచం అడిగాడని, అది కూడా రూ.100నోట్లే ఇవ్వాలని షరతు పెట్టాడని ఓ వ్యక్తి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం పన్ని బాలాసాహెబ్ లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.