లాక్డౌన్లు ఎత్తేయడం కాదు-జాగ్రత్తలేవీ- ధర్డ్వేవ్ వేళ రాష్ట్రాలకు కేంద్రం హితవు
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది. అయితే త్వరలో కరోనా ధర్డ్వేవ్ తప్పదంటూ హెచ్చరికలు కూడా మొదలైపోయాయి. ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ ఛీఫ్ రణ్దీప్ గులేరియా కరోనా ధర్డ్వేవ్ ఆరు నుంచి 8 వారాల్లో తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు పలు రాష్ట్రాలు కరోనా లాక్డౌన్లను సడలించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది.
దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం ఇవాళ లేఖలు రాసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి సీఎస్లకు లేఖలు వెళ్లాయి. ఇందులో కరోనా ధర్డ్వేవ్ ప్రభావంపై తమ వద్ద నున్న సమాచారం చెబుతూనే ... లాక్డౌన్లు తొలగిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తు చేసింది. లాక్డౌన్లు తొలగిస్తున్న సమయంలో కరోనా వేళ తాము ఇచ్చిన మార్గదర్శకాలు అమలవుతున్నాయో లేదో నిశితంగా గమనించాలని కేంద్రం సూచించింది.
మరోవైపు కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం టెస్ట్-ట్రాక్-ట్రీట్ వ్యూహాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కరోనా పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తిని గుర్తించడం, చికిత్స చేయడం లేదా వ్యాక్సిన్ వేయడం ద్వారా ఈ మహమ్మారిని తరిమికొట్టాలని కేంద్రం కోరింది. వ్యాక్సినేషన్ ఒక్కటే దీనికి మందు అని, అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు అందేలా చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సీఎస్లను కోరారు. అన్లాక్లో భాగంగా సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమని ఆయన పేర్కొన్నారు.