వెలుగుజిలుగుల దేవ్ దీపావళి -వారణాసిలో మోదీ సందడి -సంగీతానికి పరవశించిన ప్రధాని
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం వారణాసిలో సోమవారం దేవ్ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. వారణాసి ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం కావడం, ఈసారి వేడుకలను ఆయనే అతిథిగా రావడంతో వాతావరణం ఇంకాస్త సందడిగా మారింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానది ఘాట్లలో 15 లక్షల దీపాలు వెలిగించారు. విద్యుద్దీపాలంకరణతో గంగానదీ తీరం మెరిసిపోయింది. మొదటి దీపాన్ని ప్రధాని మోదీ వెలిగించి ఈ వేడుకను ప్రారంభించారు. అనంతరం గంగానదిలో ప్రధాని మోదీ పడవలో ప్రయాణించారు. ఆ తర్వాత సార్నాథ్ ఆర్కియాలాజికల్ సైట్లో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండో షోను తిలకించి మోదీ ముగ్ధులయ్యారు.
లౌడ్ స్పీకర్లలో 'మహాదేవ శివశంకర శంభో' అంటూ ఫాస్ట్ బీట్ లో భక్తిగీతం వినవస్తుండగా మోదీ ఉత్సాహంగా కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకోగా, వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి.