సోనియాపై ముప్పేటదాడి:ఆజాద్ బాంబు -సీల్డ్ కవర్ ప్రెసిడెంట్లకు విలువుదా? సీడబ్ల్యూసీకీ ఎన్నికల డిమాండ్
జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభానికితోడు అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసమ్మతి నేతలంతా కలిసి అధినేత్రి సోనియా గాంధీపై ముప్పేటదాడి జరుపుతున్నారు. కొత్త నాయకత్వం, పార్టీ ప్రక్షాళన అంశంపై సోనియాకు ఘాటు లేఖ రాసిన 23 మంది నేతలను కాంగ్రెస్ శ్రేణులు టార్గెట్ చేస్తున్న దరిమిలా.. ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు..
సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?
ఆజాద్ తాజా బాంబు..
సోనియాకు లేఖ రాసిన 23 సీనియర్లపై క్రమశిక్షణ చర్యలకు పార్టీ సిద్ధమవుతోన్న వేళ.. ఆ లేఖపై సంతకాలు చేసిన నేతలంతా ఎదురుదాడిని ముమ్మరం చేశారు. ప్రత్యర్థి బీజేపీని వదిలేసి, సొంత నేతలపై కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందంటూ కపిల్ సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది సేపటికే, మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీలో ప్రస్తుత విధానాలను తూర్పారపట్టారు. లేఖ వ్యవహారంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజాద్.. గురువారం ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైకమాండ్ పై మాటల తూటాలు పేల్చారు.
సీల్డ్ కవర్ నేతలా మాట్లాడేది?
‘‘కాంగ్రెస్ పార్టీ బాగుపడాలని కోరుకునేవాళ్లు ఎవరైనా సరే మా లేఖను కచ్చితంగా సమర్థిస్తారు. నాయకత్వం, ప్రక్షాళనపై మా వాదనను తప్పు పడుతూ, విమర్శలకు దిగుతున్నవాళ్లంతా ఎన్నికలప్పుడు సీన్ లో కనిపించరు. నిజం చెప్పాలంటే, ఇవాళ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సారధులుగా ఉన్నవాళ్లకు కనీసం ఒక్క శాతం సొంత కార్యకర్తల మద్దతు కూడా లేదనే చెప్పాలి. అందుకే సీల్డ్ కవర్ నియామకాల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. కింది నుంచి పైదాకా ఎన్నికల విధానాన్నే అవలంభించాలి. అప్పుడు సారధిగా ఉండే వ్యక్తికి 51 శాతం మంది కార్యకర్తల మద్దతైనా ఉంటుంది. తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది '' అని ఆజాద్ అన్నారు.
కోటరీకే అపాయింట్మెంట్లు..
పీసీసీ, డీసీసీ, మండల, బ్లాక్ కమిటీలలకు కచ్చితంగా ఎన్నికలు జరిపించాలన్న ఆజాద్.. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)' మెంబర్లను కూడా ఎన్నికల ద్వారానే నియమించాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి సీడబ్ల్యూసీ మెంబర్ గా ఎన్నికైన నేతను నిర్ణీత కాలం వరకు తొలగించకూడదని కోరారు. కాగా, తమ వాదనను అధినేత్రికి వినిపించాలనుకున్నా, కోటరీగాళ్లు అడ్డంపడ్డారని, ఎంతో సులువుగా అపాయింట్మెంట్లు పొందే ‘ఆ కొందరి' వల్లే అధినేత్రికి నేరుగా వాణిని వినిపించలేకపోయామని, తమపై అసమ్మతిదారులుగా ముద్రవేయడం తగదని ఆజాద్ అన్నారు. ఇదిలా ఉంటే,
ఖర్గే, అంబికపైనా చర్యలు?
కొత్త నాయకత్వం, పార్టీ ప్రక్షాళన అంశాలపై సోనియకు లేఖ రాసిన 23 మంది సీనియర్లపైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేఖపై సంతకాలు చేసినవాళ్లు ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతుండటమే ఇందు నిదర్శనం. ఉత్తరప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ లఖింపూర్ ఖేరీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. మల్లికార్జున ఖర్గే, అంబికా సోనిలపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది.
ధిక్కార జాబితాలో ఇంకొందరు..
దుష్టస్వభావం ఉన్న నేతలకు అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత అధిర్ రంజన్ ఛౌదురి చేసిన వ్యాఖ్యలు సీనియర్లను ఉద్దేశించినవేనని పార్టీలో చర్చ నడుస్తోంది. గురువారం మొదటగా కపిల్ సిబల్.. జితిన్ ప్రసాద అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ పై మండిపడగా, ఆ వ్యాఖ్యలను ఎంపీ మనీశ్ తివారి సమర్థించారు. ఆ వెంటనే ఆజాద్ మీడియా ముందుకొచ్చి మాటల తూటాలు పేల్చారు. ఈ వరుసలో ఇంకొందరు నేతలూ ఉన్నట్లు సమాచారం.
చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్కు సమీపంగా.