హత్రాస్పై ప్రధాని..నోరు మెదపరేమీ?: యోగి సర్కార్ టార్గెట్లో మృతురాలి కుటుంబం: రాహుల్
చండీగఢ్: యావత్ దేశాన్ని వణికించిన హత్రాస్ గ్యాంగ్రేప్ ఉదంతంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఈ ఘటనపై దేశం మొత్తం స్పందించినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. సామూహిక అత్యాచార మృతురాలి కుటుంబాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని మండిపడ్డారు. ఓ పథకం ప్రకారం.. మృతురాలి కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు.
సుశాంత్ సింగ్ డెత్కేస్: కొత్త కోణం: 80 వేలకు పైగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్: లింకేంటీ?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో కొనసాగుతోన్న ఖేతీ బచావో యాత్రలో ఆయన పాల్గొన్నారు. పటియాలాలోని సర్క్యుట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తనను పోలీసులు ఏ విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారో దేశం మొత్తం చూసిందని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా పరిపాలన సాగిస్తోందో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు.
హత్రాస్ బాధితురాలు మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే బులంద్షెహర్, ఆజంగఢ్ వంటి ప్రాంతాల్లో గ్యాంగ్రేప్ ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని, ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదనడానికి ఆ దారుణ ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలని రాహుల్ గాంధీ ఆరోపించారు. హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని యోగి ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రాత్రికి రాత్రి దహనం చేయడం వెనుక ఉన్న మర్మమేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాల రైతాంగానికి మరణశాసనంలా మారాయని రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ ఆహార భద్రత వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. అందరికీ ఆహార భద్రతను కల్పించిన తమ ప్రభుత్వం.. వ్యవసాయ రంగాన్ని, దాని అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ వ్యవస్థ మొత్తం ధ్వంసమౌతోందని చెప్పారు. దాన్ని తాము అడ్డుకుని తీరుతామని చెప్పారు.
వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు, వినియోగదారులు తీవ్రంగా దెబ్బతింటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాల వల్ల రైతులు బాగుపడతారంటూ చెబుతోన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చించడానికి ఎందుకు భయపడిందని ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రత్యక్ష దాడికి ఈ చట్టాలే నిదర్శనమని విమర్శించారు. ఖేతీ బచావో యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.