షాక్: ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 % నుండి 8.5% తగ్గింపు యోచన?
న్యూఢిల్లీ: పీఎఫ్ చందాదారులు ఈ ఏడాది తమ రిటైర్మెంట్ కార్పస్లపై తక్కువ వడ్డీరేట్లు పొందనున్నారు. గతేడాది 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఈ ఏడాది 8.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది.ఈ నెల 23వ, తేదిన జరిగే సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
Recommended Video
గత ఏడాదితో పోలిస్తే పీఎఫ్ చందాదారుల వడ్డీరేట్లను తగ్గించేందుకు రంగం సిద్దమైందని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే అదే సమయంలో పీఎఫ్ వడ్డీరేట్లపై ఈ నెల 23వ, తేదిన బోర్డు సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.
పీఎఫ్ వడ్డీరేట్లు తగ్గించే యోచన
పీఎఫ్ చందాదారుల రిటైర్మెంట్ కార్పస్లపై 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 8.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ నెల 23వ, తేదిన ప్రభుత్వ బోర్డు ట్రస్టీలు, ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ భేటీ కాబోతుందని అధికారిక వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు.
ఈక్విటీ పెట్టుబడులు తగ్గించడమే కారణమా?
ప్రావిడెంట్ ఫండ్ తగ్గినప్పటికీ, మొత్తం రిటర్నులు ఎక్కువగానే పొందనున్నట్టు తెలుస్తోంది. వీటిని ఈక్విటీ పెట్టుబడులకు తరలించడమే ప్రధాన కారణమని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఈ ఏడాది ఈపీఎఫ్ఓ 15 శాతం తన కార్పస్ను ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ల ద్వారా ఈక్విటీలో పెట్టుబడులుగా పెట్టిందని తెలిసింది. దీని ద్వారా ఆర్జించిన మొత్తాలను సబ్స్క్రైబర్ షేరు కింద వారి పీఎఫ్ అకౌంట్లోకి యూనిట్ల రూపంలో జమచేయాలని ప్రతిపాదించింది.
సబ్స్క్రిషన్ రెడీమ్ చేసుకోవచ్చు
ఎప్పుడైతే పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటారో అప్పుడు సబ్స్క్రైబర్ ఆ యూనిట్లను రిడీమ్ చేసుకునే అవకాశముంటుంది. దీంతో సబ్స్క్రైబర్ పొందే మొత్తం ఆదాయం ఈటీఎఫ్ మార్కెట్ ధరపై ఆధారపడిన యూనిట్ల లాభాలు, డెట్లో పెట్టుబడులుగా పెట్టిన ఫండ్ వడ్డీరేట్లు కలిసి ఉండనున్నాయి. చాలా వరకు పీఎఫ్ కార్పస్ను ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులుగా పెడతారు.
ఈపీఎఫ్లో 4.5 కోట్ల మంది చందాదారులు
పాత స్థాయిల్లో వడ్డీరేట్లను కొనసాగించడం చాలా కష్టతరమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 20 ఏళ్ల సెక్యూరిటీల మెచ్యూరిటీ తీరిపోతుండటంతో కొత్త సెక్యూరిటీలను తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్టు అధికారి తెలిపారు. ఈ క్రమంలో రిటైర్మెంట్ కార్పస్లపై వడ్డీరేట్లు తగ్గనున్నట్టు పేర్కొన్నారు. గతేడాదే అంతకముందున్న పీఎఫ్ వడ్డీరేట్లను 8.8 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 4.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు.