ఉద్యోగులకు కేంద్రం తీపికబురు...పెరగనున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు..?
2019 సాధారణ ఎన్నికలకు ముందు ఉద్యోగస్తులకు తీపికబురు చెప్పనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించిన వడ్డీరేటును పెంచే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పీఎఫ్ పై వడ్డీ రేటు 8.55శాతం ఉంది. త్వరలో వడ్డీ రేటు పెంచే అవకాశం ఉందని ఈపీఎఫ్కు సంబంధించిన ముగ్గురు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ద్రవ్యోల్బణం కారణంగా పెరగకపోతే ప్రస్తుత వడ్డీరేటునే కొనసాగిస్తామని తగ్గించే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు అధికారులు.
పెరగనున్న వడ్డీ రేటు
ప్రస్తుతం ఆడిట్ జరగుతోంది. దీని తర్వాత అంతర్గత వార్షిక సమీక్ష ఉంటుంది. ఆ సమయంలో ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2019 ఆర్థిక సంవత్సారానికి ఈఫీఎఫ్ పై వడ్డీ పెంపు గురించి ఆలోచిస్తున్నామని అది 8.55 శాతం కంటే మెరుగ్గా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీ సభ్యులు ప్రభాకర్ బనాసురే. ద్రవ్యోల్బణం కారణంగా దీన్ని తగ్గించే పరిస్థితి అయితే లేదని స్పష్టం చేశారు.
లబ్ది పొందనున్న ఆరుకోట్ల మంది ఉద్యోగులు
ఒక వేళ ఈపీఎఫ్ వడ్డీని పెంచితే... దేశంలోని కొన్ని కోట్ల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు. ఒకవేళ వడ్డీని పెంచుతూ నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రకటించిన 50శాతం ప్రోత్సహాకాలతో పాటే ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే నేషనల్ పెన్షన్కు సంబంధించి డబ్బులు తీసుకుంటే వాటిపై ఎలాంటి ట్యాక్స్ ఉండబోదని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది.
రూ.50వేల కోట్లు స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఈపీఎఫ్ఓ
పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లకు సంబంధించి సరాసరి వడ్డీరేటు 2018లో 7.7శాతంగా ఉన్నింది. రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టిన వాటిలో 2018లో ఆశించిన లాభాలు రాలేదని ఓ నివేదిక పేర్కొంది. ఇక గతేడాది 8.55 శాతం వడ్డీ ఉన్న సమయంలో ఈపీఎఫ్ఓ వద్ద రూ. 600 కోట్లు అదనంగా ఉన్నిందని రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు రూ. 50వేల కోట్లు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం.