ఖాతాదారులకు శుభవార్త: 30 రోజులు ఉద్యోగం లేకుంటే 75శాతం పీఎఫ్ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగం లేకుండా నెల రోజులు గడిస్తే ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ పీఎఫ్ అకౌంట్ నుంచి 75 శాతాన్ని అడ్వాన్సుగా తీసుకోవచ్చు. రెండు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉంటే మిగిలిన 25 శాతం కూడా తీసుకోవచ్చు. కొత్త నిబంధనల కింద ఇలాంటి ఐచ్ఛికాన్ని మెంబర్స్కు ఇవ్వాలని మంగళవారం జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం లేని వారు రెండు నెలల తర్వాతే తమ పీఎఫ్ను పూర్తిగా ఒకేసారి పొందడానికి వీలు ఉంది. దీనిని నెలకు తగ్గించడం వల్ల సభ్యులు తమ ఖాతాను ఈపీఎఫ్వోలో కొన్నాళ్లు కొనసాగించుకోవచ్చు. మళ్లీ ఉద్యోగం దొరకగానే దానిని పీఎఫ్ జమల కోసం ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగం లేనప్పుడు అరవై శాతం నిధులను ఉపసంహరించుకోవచ్చని ప్రతిపాదించినా సీబీటీ మాత్రం దీనిని 75 శాతానికి పెంచింది.
కేంద్ర కార్మిక సాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మాట్లాడుతూ... ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఈటీఎఫ్లలో రూ.47,431 కోట్లను పెట్టుబడిగా పెట్టామనీ, దానిపై 16.07% ప్రతిఫలం లభిస్తోందన్నారు. త్వరలోనే ఈ పెట్టుబడులు రూ.లక్ష కోట్లు దాటుతాయన్నారు.