ఓటరు ఐడీలపై ఈసీ సంచలన నిర్ణయం -ఆధార్ తరహాలో అందరికీ డిజిటల్ ఓటరు కార్డులు -జారీ ఎప్పుడంటే
జమిలి ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతుండటం.. ఆన్ లైన్ పోలింగ్ కోసమూ వినతులు వెల్లువెత్తుతోన్న వేళ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక అడుగులు వేస్తోంది. ఇకపై అందరి ఓటరు గుర్తింపు కార్డులను డిజిటలైజ్ చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఆధార్ కార్డుల తరహాలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల ఫోటో ఐడెంటిటీ కార్డ్ (ఈపీఐసీ)లను పూర్తి డిజిటల్ పద్ధతికి మార్చనుంది..
డిజిటల్ వెర్షన్తో ఓటు
ఆధార్ కార్డుల్ని ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నట్లుగానే రాబోయే రోజుల్లో ఓటర్ ఫొటో ఐడీలకు కూడా డౌన్ లోడ్ సదుపాయం కల్పించి, ఆ డిజిటల్ వెర్షన్ ను ఉపయోగించి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. ఓటరు కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయయని, ఇంకొన్ని వర్గాలతో కీలక చర్చల అనంతరం తుది నిర్ణయం వెలువడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
2021 మేలోపే ప్రక్రియ..
నిజానికి గడిచిన రెండు మూడేళ్లుగా కొత్తగా దరఖాస్తు చేసుకుంటోన్న ఓటర్లకు ఆధునిక టెక్నాలజీలో డిజిటల్ కార్డులనే ఈసీ జారీ చేస్తున్నది. అయితే పాత ఐడీ కార్డులు అన్నింటినీ డిజిటలైజ్ చేసే దిశగా ఆలోచన చేయడం మాత్రం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది(2021లో) మొత్తం ఐదు రాష్ట్రాల్లో(అస్సాం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఆలోపే అన్ని ఓటరు ఐడీకార్డుల డిజిటలైజేన్ చేయాలని ఈసీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ఓటరు ఐడీపై రెండు క్యూఆర్ కోడ్స్
డిజిటల్ రూపంలోకి మారనున్న ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల్లో ఓటరుకు సంబంధించిన సమాచారాన్ని రెండు వేర్వేరు క్యూఆర్ కోడ్(QR codes)లలో నిక్షిప్తం చేస్తారు. (ప్రస్తుతం జారీ అవుతోన్న కొత్త కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఒకటే ఉంటోన్న సంగతి తెలిసిందే). కొత్తగా జారీ కాబోయే డిజిటల్ ఓటర్ ఐడీల్లో మొదటి క్యూఆర్ కోడ్ లో మన పేరు, తల్లి లేదా తండ్రి పేరు, ఫొటోను పొందుపరుస్తారు. ఇంక రెండో క్యూర్ కోడ్ లో ఇతర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. ఆధార్ కార్డులాగానే కొత్త ఓటరు ఐడీలకు కూడా మన మొబైల్ నంబర్ ను అనుసంధానం చేసుకుని, కార్డును ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పిస్తారు. అయితే..
ఓన్లీ డిజిటల్.. ఫిజికల్ కార్డుల్లేవు
ఓటర్ ఐడీల డిజిటలైజేషన్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ త్వరలో చేపట్టబోయే ప్రక్రియను తొలి దశలో ఈ-విధానంలో మాత్రమే చేపడతారు. అంటే నేరుగా(ఫిజికల్ గా) కొత్త కార్డుల జారీ లాంటిదేదీ ఉండదు. రాబోయే రోజుల్లో ఆధార్ మాదిరిగానే కొన్ని నిర్ధిష్టమైన కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టే అవకాశముంది. దీని ద్వారా
Recommended Video
27 ఏళ్ల తర్వాత కీలక సంస్కరణలు
ఓటరు ఐడీ కార్డులను ఆధార్ కార్డుల తరహాలో డిజిటలైజ్ చేయడం వల్ల .. ఎన్నికలకు ముందు ఊరు మారినవాళ్లు తమ ఓటును వేరొక చోటికి మార్చుకోవడానికి ప్రస్తుతం జరిగే ప్రహాసం రాబోయే రోజుల్లో ఉండబోదు. అడ్రస్ మార్పు, కొత్త దరఖాస్తుల ప్రక్రియ ఇంకా సరళతరం కానుంది. అయితే, ఈ మార్పులకు సంబంధించి ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 1993లో టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో మనదేశంలో తొలిసారి ఓటరు ఫొటో ఐడెంటిటీ కార్డుల విధానాన్ని తీసుకురావడం తెలిసిందే. తర్వాతి కాలంలో దాదాపు అందరికీ ఫొటోతో కూడిన ఓటరు ఐడీలను జారీ చేశారు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో రెండుమూడేళ్లుగా డిజిటల్ కార్డుల్ని జారీ చేస్తున్నప్పటికీ 27 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో డిజిటలైజేషన్ సంస్కరణను ఈసీ చేపట్టనుండటం గమనార్హం.