ఎంజీఆర్, జయలలిత ఎన్నో త్యాగాలు చేశారు, అన్నాడీఎంకే పార్టీకి 46 ఏళ్లు, పళని, పన్నీర్ !
అన్నాడీఎంకే పార్టీకి 46 ఏళ్లు, తమిళనాడులో పార్టీ జెండాలు రెపరెపలుఎంజీఆర్, జయలలిత పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు, కష్టపడుదాం రండిపార్టీ కార్యాకర్తలకు సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం పిలుపు, రెండాకుల
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని దివంగత ముఖ్యమంత్రి ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) స్థాపించి నేటికి 46 ఏళ్లు అయ్యింది. మంగళవారం చెన్నైలోని రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకుని ఎంజీఆర్, జయలలితకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇద్దరూ కలిసి అన్నాడీఎంకే పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమిళనాడులోని అన్ని జిల్లాల నాయకులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్బంగా ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంజీఆర్ ప్రజల కష్టాలు తీర్చడానికి 46 ఏళ్ల క్రితం ఇదే రోజు పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఎంజీఆర్, అమ్మ జయలలిత ఎన్నో త్యాగాలు చేసి పార్టీని కాపాడుకుని వచ్చారని, ప్రజలకు సేవ చేశారని చెప్పారు.
భారత ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కచ్చితంగా మాకే వస్తోందని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం సొంతం చేసుకుని త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఎంజీఆర్, అమ్మ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకు వెలుతామని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం అన్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే పార్టీ జెండాలు ఎగరవేసి పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.