ముస్లింలపై ఊచకోత.. మీరా ప్రపంచశాంతికి పాటు పడేది : భారత్పై టర్కీ అధ్యక్షుడు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత్ ఇప్పుడు విచ్చలవిడి నరమేధాలు జరిగే దేశంగా మారిందన్నారు. 'ఏవిధమైన ఊచకోత.. ముస్లింల ఊచకోత.. ఎవరిచేత.. హిందువుల చేత..' అంటూ వ్యాఖ్యానించారు. టర్కీ రాజధాని అంకారాలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎర్డోగన్ ఢిల్లీ అల్లర్లపై స్పందించారు.
భారత్పై టర్కీ అధ్యక్షుడి తీవ్ర ఆగ్రహం
ఢిల్లీలో అలర్లలో రెచ్చిపోయిన మూకలు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయన్నారు. ట్యూషన్ సెంటర్స్లో చదువుకుంటున్న ముస్లిం విద్యార్థులపై సైతం కర్రలతో దాడి చేసి చంపాలనుకున్నారని ఆరోపించారు. ఇలాంటివారు ప్రపంచ శాంతి కోసం ఏం పాటుపడుతారని ప్రశ్నించారు. అది అసాధ్యమన్నారు. ఎక్కువ జనాభా ఉన్నందునా.. ప్రసంగాలు చేసేటప్పుడు.. తాము బలంగా ఉన్నామని వాళ్లు చెబుతారని.. కానీ అది బలం కాదని ఎర్డోగన్ విమర్శించారు. కాగా,ఎర్డోగన్ ఇస్లాంను ఆరాధించే ముస్లిం. తనను తాను ఇస్లాం రక్షకుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా ఢిల్లీ అల్లర్లపై మాట్లాడారు.
గతంలో కశ్మీర్పై
ఇటీవలే ఎర్డోగన్ కశ్మీర్ సమస్యపై కూడా మాట్లాడి దుమారం రేపారు. కశ్మీర్ రెండు దేశాలకు ఆందోళనకర అంశం అని.. దాని విషయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతునిస్తోందని ఎర్డోగన్ తెలిపారు. ఏకపక్ష నిర్ణయాల కారణంగా కశ్మీరీ ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలతో సమస్యలు మరింత జటిలం అయ్యాయని వ్యాఖ్యానించారు.అంతేకాదు,ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF)కు సంబంధించి పాకిస్తాన్ను గ్రే జాబితా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కశ్మీర్ పరిష్కారానికి టర్కీ న్యాయం,శాంతి,చర్చల వైపు నిలుస్తుందన్నారు.
మోదీ సర్కార్పై విమర్శలు..
అటు పలువురు విమర్శకులు సైతం నరేంద్ర మోదీ తీరును తప్పు పడుతున్నారు. సెక్యులర్ దేశాన్ని ఆయన హిందుత్వ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే,ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 38 మందికి చేరింది. దాదాపు 200 పైచిలుకు మంది గాయపడ్డారు. అల్లర్లపై విచారణకు కేంద్రం రెండు ప్రత్యేక విచారణ బృందాలు(SIT)ను నియమించింది. ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల నేత్రుత్వంలో సిట్ టీమ్స్ పనిచేయనున్నాయి. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జరిగిన అల్లర్లను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకవేళ నిందితులు తమ పార్టీకి చెందినవారైతే డబుల్ పనిష్మెంట్ ఉంటుందన్నారు.