ముందు కాస్త అవగాహన పెంచుకోండి.. కశ్మీర్పై పాక్కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడికి భారత్ చురకలు..
జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తీరును భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ జోక్యాన్ని తిరస్కరించింది. కశ్మీర్ భారత అంతర్భాగం అని,విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరుచూ భారత్పై కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టేందుకు గతంలో ఐరాస జనరల్ అసెంబ్లీలోనూ ఇమ్రాన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా టర్కీ అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్తాన్కు వచ్చిన సందర్భంగా.. ఆయనతో జరిగిన భేటీలో ఇమ్రాన్ కశ్మీర్ అంశాన్ని చర్చకు పెట్టారు.
ఎర్డోగన్ ఏమన్నారు..
కశ్మీర్ రెండు దేశాలకు ఆందోళనకర అంశం అని.. దాని విషయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతునిస్తోందని ఎర్డోగన్ తెలిపారు. ఏకపక్ష నిర్ణయాల కారణంగా కశ్మీరీ ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలతో సమస్యలు మరింత జటిలం అయ్యాయని వ్యాఖ్యానించారు.అంతేకాదు,ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF)కు సంబంధించి పాకిస్తాన్ను గ్రే జాబితా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ మేరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కశ్మీర్ పరిష్కారానికి టర్కీ న్యాయం,శాంతి,చర్చల వైపు నిలుస్తుందన్నారు.
గల్లిపోలీతో పోల్చిన ఎర్డోగన్
కశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్ టర్కీలోని గల్లిపోలీతో పోల్చడం గమనార్హం. ఒకప్పుడు గల్లిపోలీ విముక్తి కోసం అక్కడి మిత్రపక్షాలు ఒట్టమాన్ రాజవంశీయులతో చేసిన పోరాటంలో ఇరువైపులా దాదాపు 2లక్షల మంది మృతి చెందారు. గల్లిపోలీకి కశ్మీర్కు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా టర్కీ గొంతెత్తుతూనే ఉంటుందన్నారు. గతంలో యూఎన్ జనరల్ అసెంబ్లీలోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.
కాస్త అవగాహన పెంచుకోండి.. భారత్ చురకలు
కశ్మీర్ విషయంలో టర్కీ అధ్యక్షుడి జోక్యాన్ని భారత్ ఖండించింది. జమ్మూకశ్మీర్ భారత అంతర్భాగం అని, విడదీయరాని భాగమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమని అందులో ఇతరుల జోక్యానికి తావు లేదని చెప్పారు. అదే సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్కు పొంచి వున్న ముప్పు గురించి,ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి కాస్త వాస్తవాలు తెలుసుకోవాలని అవగాహన పెంచుకోవాలని టర్కీ నాయకత్వానికి సూచించారు.
గతంలో ఇమ్రాన్ కూడా..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 74 సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ భారత్పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతానికి దారితీస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు,యుద్దమంటూ జరిగితే చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు.