అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలని ఎరిక్సన్ పిటిషన్, విదేశాలకు పారిపోకుండా చూడండి
న్యూఢిల్లీ: ఆర్.కామ్ చైర్మన్ అనిల్ అంబానీని అరెస్టు చేయాలని స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్సన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండోసారి కాంటెప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎరిక్సన్ బకాయిలు ఆయనను వెంటాడుతున్నాయి.
అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలని, ఆయన దేశం విడిచి పోకుండా చూడాలని ఎరిక్సన్ అత్యున్నత న్యాయస్థానంలో ఈ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తున్నారని పేర్కొంది. నిజానికి ఇది తగ్గించిన మొత్తమని, దీనిని చెల్లిస్తానని కోర్టుకు అనిల్ అంబానీ వ్యక్తిగతంగా హామీపత్రం ఇచ్చారని పేర్కొంది.
కానీ కోర్టులో కుదిరిన ఒప్పందానికి ఆయన ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలోనే గడువు అయిపోయిందని, అక్టోబర్ నెలలో ఎరిక్సన్ తొలిసారి కోర్టుధిక్కార పిటిషన్ వేసింది. దాంతో కోర్టు ఆయనకు డిసెంబర్ 15 వరకు గడువిచ్చింది. దానిని కూడా ఉల్లంఘించారని ఇప్పుడు రెండోసారి పిటిషన్ వేసింది.
మరోవైపు, తాను చెల్లింపులు జరుపకపోవడానికి టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కారణమని ఆర్.కామ్ విడిగా మరో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. స్పెక్ట్రమ్ అమ్మకం నిధులు అందిస్తే ఎరిక్సన్తో పాటుగా ఇతర కంపెనీలకు తాము బకాయిలు చెల్లించేవారమని పేర్కొంది.