జయలలిత ఆస్తుల విలువలో పొరపాటు: మళ్లీ లెక్కలు చూస్తున్న జడ్జి?
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పైన ఇచ్చిన తీర్పును కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుమార స్వామి తిరిగి పరీశీస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు. అయినప్పటికీ బుధవారం ఉదయం పది గంటలకు న్యాయమూర్తి తన కార్యాలయానికి వచ్చారు. తీర్పుకు సంబంధించిన అంశాలను పరిశీలించారని తెలుస్తోంది.
జయలలిత ఆస్తుల విలువను లెక్కకట్టడంలో పొరపాట్లు దొర్లినందునే ఆమె శిక్ష నుండి తప్పించుకోగలిగారని, ఆమె ఆస్తి ఆదాయాని కంటే రూ.16.34 కోట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ హైకోర్టు రూ.2.82 కోట్లుగానే పరిగణించిందని కర్నాటక ప్రభుత్వ న్యాయవాది బీవీ ఆచార్య మంగళవారం చెప్పారు.
ఈ నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయమూర్తి గణాంకాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, హైకోర్టులో ఒకసారి ఇచ్చిన తీర్పును అదే న్యాయమూర్తి సవరించేందుకు వీల్లేదని నిపుణులు చెబుతున్నారు. గణాంకాల్లో తేడాలను గుర్తిస్తే, తీర్పును బదలీ చేయాల్సి వస్తే పైకోర్టుకు వెళ్లాల్సిందేనని అంటున్నారు.
జయలలిద నిర్దోషి అని కర్నాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అది అమలుకాకుండా సుప్రీం కోర్టు నుండి స్టే ఉత్తర్వును పొందేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరారు. డీఎంకే నేతలు కూడా సిద్ధరామయ్యను కలిశారు.