పిల్లలు వాడేందుకు మరో వ్యాక్సిన్ రెడీ -మోర్నావారి Spikevaxకు ఈయూ ఆమోదం -12-17ఏళ్ల వారికి
డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల తర్వాత కొత్తగా పుట్టుకురాబోయే కరోనా రకాలు పిల్లల పాలిట ప్రమాదకారులుగా మారొచ్చనే భయాల నడుమ ఊరట వార్త వెలువడింది. పిల్లలు అత్యవసరంగా వాడేందుకు మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా ఫార్మా దిగ్గజం మోడెర్నా తయారు చేసిన పిల్లల వ్యాక్సిన్ కు యురోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం ఆమోదం తెలిపింది.
Recommended Video
12 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలు వినియోగించేందుకుగానూ మోడెర్నా సంస్థ 'స్పైక్వాక్స్'పేరుతో టీకాను అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో దాని సమర్థత నిరూపణ కావడంతో ఆ టీకాకు యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఆమోదం తెలిపింది. 18 ఏళ్లు పైబడినవారు మోడెర్నా టీకాలను ఎలాగైతే వేసుకుంటారో, ఈ 'స్పైక్వాక్స్'కు కూడా ఇంజెక్షన్ల రూపంలోనే రెండు డోసుల్లో పిల్లలకు అందజేయనున్నారు.
మొత్తం 3,732 మంది 12 నుంచి 17 ఏళ్ల పిల్లలపై స్పైక్ వాక్స్ టీకాను ప్రయోగించి చూడగా, 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గలవారిలో మాదిరిగానే యాంటీ బాడీల పెరుగుదల కనిపించిందని ఈఎంఏ ప్రకటనలో పేర్కొంది. పిల్లల కోసం యూరోపియన్ యూనియన్ ఆమోదించిన రెండో వ్యాక్సిన్ ఇది. ఈ ఏడాది మే నెలలో ఫైజర్ వారి పిల్లల టీకాకు ఈయూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే,
ఫైజర్ వ్యాక్సిన్ కోసం భారత్ చర్చలు -అందరికీ టీకాలకు టైమ్ లైన్ లేదు -ఇప్పటికే రూ.10వేల కోట్ల ఖర్చు
పిల్లల వ్యాక్సిన్లు రెండిటికి యూరప్ దేశాలు ఆమోదం తెలపగా, ఇటు భారత్ లోనూ ఆ ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. జైడస్ క్యాడిల్లా సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్-డీ (ZyCoV-D) కరోనా వ్యాక్సిన్ 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రభుత్వం గత వారం వెల్లడించింది. ట్రయల్న్ పూర్తయిన వెంటనే పిల్లల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది..