బీజేపీని హేమమాలిని కాపాడుతారా?: లాలూ
పాట్నా: బీహార్ లో బీజేపీ పని అయిపోందని, ఇక మూట ముళ్లు సర్దుకోవడానికి ఆ పార్టీ నేతలు సిద్దంగా ఉండాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ మూడవ విడత ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ నాయకులు డ్రీమ్ గాల్ హేమమాలినిని రంగంలోకి దింపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున హేమమాలిని స్టార్ కాంపైనర్ గా కొనసాగుతున్నారు. ఈ విషయంపై లాలా ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో స్పందించి బీజేపీ నాయకులకు చరకలు అంటించారు.
హేమమాలినితో ఎన్నికల ప్రచారం చేయించి ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటే బీజేపీ నాయకులు పప్పులో కాలేసినట్లే అన్నారు. బీహార్ లో బీజేపీని హేమమాలిని రక్షిస్తారా అని ప్రశ్నించారు. బీహార్ లో హేమమాలిని బీజేపీని రక్షించలేరనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అన్నారు.
రిజర్వేషన్లు రద్దు చెయ్యాలని బీజేపీ భావిస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని చెప్పారని గుర్తు చేశారు. ఆయనతో మీరు ఏకీభవిస్తున్నారా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. రిజర్వేషన్ల గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.