మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖ
పాట్నా: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) ఫాంలలో పొందుపర్చబడిన వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. తనకు తన తల్లి ఎప్పుడు పుట్టిందో తనకు తెలియదని అన్నారు.
ఎన్ఆర్సీని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదని సీఎం నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. కాలా కానూన్ అంటూ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్ష పార్టీల నేతలు అసెంబ్లీలో నిరసనలు చేసిన క్రమంలో బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ స్పందించారు.
సీఏఏ-ఎన్పీఆర్-ఎన్ఆర్సీలపై వాయిదా తీర్మానం చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి దీనిపై చర్చకు అంగీకరించారు. ఇందుకు తగిన సమయం కేటాయిస్తామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో గందరగోళం సృష్టించవద్దని కోరారు.
వచ్చే సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించుకుందామని సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే చెప్పారని స్పీకర్ గుర్తు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టబడలేదని అన్నారు. వాయిదా తీర్మానం చర్చకు తాము అంగీకరించామని, ప్రతిపక్ష సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.
సీఎం నితీష్ కుమార్ వాయిదా తీర్మానంపై జవాబు ఇస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేతలు కాలా కానూన్(నల్ల చట్టం) అంటూ నినాదాలు చేశారు. దీన్ని బీజేపీ మంత్రులు నంద కిశోర్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఇది సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. ఎప్పుడైనా నల్లా చట్టాన్ని పార్లమెంటు ఆమోద ముద్ర వేస్తుందా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 15 నిమిషాలపాటు వాయిదా పడింది.
సీఏఏకు మద్దతు ప్రకటించిన సీఎం నితీష్ కుమార్.. ఎన్పీఆర్ అమలుకు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించి అమలు చేయాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరారు. నిబంధనలను సడలించి ఎన్పీఆర్ అమలు చేయవచ్చని అన్నారు. అయితే, ఎన్ఆర్సీని మాత్రం దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం లేదని నితీష్ స్పష్టం చేశారు.