ఇందిరలానే మోడీకి: సుబ్రమణ్యస్వామి హెచ్చరిక
ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మీడియాలో ఉండే.. భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మీడియాలో ఉండే.. భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా నవంబర్ 8న ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళాన్ని సరిదిద్దకపోతే ప్రజాదరణ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఓ ఇంగ్లష్ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఆరు నెలల పాటు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందనీ.. ఆ తర్వాత ప్రజాదరణ అంతా ఆమెకు ప్రతికూలంగా మారిందని గుర్తుచేశారు.
ఆ తర్వాత, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీపైనా విమర్శలు చేశారు. నోట్లరద్దు నిర్ణయం అమలు ఘోరంగా ఉందన్నారు. ఆర్థికవేత్తలైన ఆర్థికశాఖ మంత్రులు దేశానికి అవసరం కానీ, 2+2=4అని చెప్పే వారు అవసరంలేదన్నారు.
నోట్లరద్దుతో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించారు. అలాగైతే నోట్లరద్దుతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు వచ్చినా అది 2019 ఎన్నికల్లో ప్రభావం చూపదని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు.