శ్రీరాముడు కూడా గెలవాలంటే డబ్బు ఖర్చు పెట్టాల్సిందే: ఆరెస్సెస్ గోవా మాజీ చీఫ్
పనాజీ: ప్రస్తుత కాలంలో స్వయంగా శ్రీరాముడు దిగివచ్చినా డబ్బులు ఖర్చు పెట్టనిదే ఎన్నికల్లో గెలవలేడని గోవా ఆరెస్సెస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల పరిస్థితి అలా ఉందని వాపోయారు. అతను గోవా సురక్ష మంచ్ (జీఎస్ఎం) యూత్ కన్వెన్షన్లో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు మహిళలు, యువతను తమ పార్టీల వైపు మళ్ళించుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. అందులో ఒకరు మహిళలు, రెండోవారు యువత అన్నారు. వీరిని ఆకట్టుకోవడంలో రాజకీయ నాయకులు బిజీగా ఉంటారని చెప్పారు.
తమపై నమ్మకం కల్గించేందుకు నాయకులు వీరికి డబ్బు లేదా బహుమతులు ఇస్తుంటారని చెప్పారు. ఎన్నికల్లో డబ్బుకు అధిక ప్రాబల్యం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరాముడు వచ్చి పోటీ చేసినా కూడా డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆయన గెలవలేరని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్పై కూడా వెలింగ్కర్ విమర్శలు చేశారు. అనారోగ్యంగా ఉన్నారని పారికర్ తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తీసేశారని, ఇప్పుడు ఆయనే అనారోగ్యానికి గురయ్యారన్నారు. గోవాలో ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవన్నారు. సామాన్యులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటే ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు మాత్రం చిన్న అస్వస్థతకే అమెరికా వెళ్తున్నారన్నారు.