Everest height : నేపాల్ లెక్కలతో విబేధించిన చైనా .. ఎత్తుపై సర్వే చేసి ఏం చెప్పిందంటే
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్టు పర్వతం. అయితే ఎవరెస్టు పర్వతం ఎత్తుపై నేపాల్ చెప్తున్నలెక్కలతో చైనా విభేదించింది. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్టు ఎత్తును ఎక్కువ చేసి చెబుతుందని చైనా ఆరోపిస్తుంది.ఇక అందులో భాగంగా ఎవరెస్టు యొక్క ఖచ్చితమైన ఎత్తును గుర్తించేందుకు చైనా సర్వే బృందం టిబెట్ నుండి ఎవరెస్టు శిఖరానికి చేరుకుంది.
నేపాల్ చెప్పిన లెక్కల కన్నా నాలుగు మీటర్లు తక్కువ ఎత్తు ఉన్న ఎవరెస్ట్
ఆరు దశలుగా ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తును కొలిచిన సర్వే బృందం తమ సర్వే ప్రకారం ఎవరెస్టు పర్వతం యొక్క ఎత్తు 88 44.43 మీటర్లు అని పేర్కొన్నారు. ఇది నేపాల్ చెబుతున్న లెక్కల కంటే నాలుగు మీటర్ల తక్కువగా ఉందని వారంటున్నారు. మే 1న,ఎవరెస్ట్ శిఖరం ఎత్తుపై నేపాల్ తో విభేదించిన చైనా ఎత్తును కొలవాలని నిర్ణయం తీసుకొని ఒక కొత్త సర్వే ప్రారంభించింది. మౌంట్ ఎవరెస్ట్ పై సర్వే కోసం వెళ్లిన చైనా సర్వేయర్లు ఆరు దశలుగా పర్వతం కొలతను నిర్వహించారు.అంతేకాదు ఎవరెస్ట్ శిఖరంపై శాస్త్రీయ పరిశోధనలు సైతం జరిపారు.
ఇప్పటికి మూడు సార్లు ఎవరెస్ట్ ఎత్తుపై చైనా సర్వే
ఇక గతంలోనూ 1975లో ఒకసారి, 2005లో మరోసారి శిఖరం యొక్క ఎత్తు కొలిచి వారి నివేదికలను వెల్లడించారు. మొదటిసారి 8848.13 మీటర్లు ఎత్తు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రెండోసారి 8844.43 మీటర్లు ఎత్తు ఉన్నట్లుగా నివేదించారు. ప్రస్తుతం మూడోసారి కూడా ఎవరెస్ట్ పర్వతం యొక్క కొలతలు నిర్వహించిన చైనా ప్రస్తుత ఎత్తు 8844.43 మీటర్లు అని నివేదించింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎత్తును కొలవడానికి చైనా ఇప్పటికి మూడు సార్లు సర్వే చేసింది.
ప్రకృతిపై జ్ఞాన అభివృద్ధికి, శాస్త్రీయ శోధనకు దోహదం
ఇది ప్రకృతిపై మానవుడు జ్ఞానాన్ని పెంపొందించటానికి,శాస్త్రీయ అభివృద్ధి ని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చైనా మరియు నేపాల్ సరిహద్దు వివాదాన్ని 1961లో ఎవరెస్టు శిఖరం గుండా సరిహద్దు రేఖతో పరిష్కరించుకున్నాయి. ఇక ఎవరెస్టు శిఖరంపైకి అధిరోహించే వారి సంఖ్య నేపాల్ తో పోల్చి చూస్తే చైనా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచిన కారణంగా టిబెట్ వైపు నుండే ఎక్కువ మంది అధిరోహిస్తున్నట్లుగా సమాచారం.
ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5జి స్టేషన్ లను నిర్మించనున్న చైనా టెక్ సంస్థ
కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నేపాల్ ఎవరెస్టు శిఖరంతో సహా హిమాలయ శిఖరాలన్నింటినీ మార్చిలోనే మూసివేసింది. ఇక తాజాగా ఎత్తు విషయంలో నేపాల్ ప్రకటనతో అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా నేపాల్ చెప్పిన దానికంటే నాలుగు మీటర్ల ఎత్తు తక్కువ ఉందని తేల్చింది.ఎవరెస్టు శిఖరం పై రెండు 5జి స్టేషన్ లను నిర్మించడానికి చైనా టెక్ సంస్థ హువావే చైనా మొబైల్ తో కలిసి పని చేస్తోంది.ఈ రెండుస్టేషన్లు నిర్మిస్తే ఇవి ప్రపంచంలోనే అత్యధిక భూగోళ 5 జీ బేస్ స్టేషన్లుగా ఉంటాయని గ్లోబెల్ టైమ్స్ పేర్కొంది.