దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా, పట్టణాల్లోనే భారీగా: ఐసీఎంఆర్ సెరో సర్వే
న్యూఢిల్లీ: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కరోనా మహమ్మారి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది. ఆగస్టు 2020 వరకే ప్రతి 15 మంది(పదేళ్లకు పైబడిన) లో ఒకరికి కరోనా వచ్చిందని ఐసీఎంఆర్ తెలిపింది. ఐసీఎంఆర్ రెండో నేషనల్ సెరో-సర్వేలో ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
కరోనా గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువ
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మంగళవారం సెరో సర్వేపై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ మురికివాడలు, అర్బన్ నాన్ స్లమ్ ఏరియాస్లో సార్స్-కోవ్2(కరోనావైరస్) తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో రెండు రేట్లు ఎక్కువగా, పట్టణ ప్రాంతాల మురికివాడల్లో నాలుగు రేట్లు ఎక్కువగా కరోనా ప్రభావం ఉందని తెలిపారు. పట్టణ మురికివాడల్లో 15.5 శాతంగా కరోనా ప్రభావం ఉండగా, మురికివాడలు లేని పట్టణ ప్రాంతాల్లో ఈ మహహ్మారి ప్రభావం 8.2 శాతం ఉందన్నారు.
దేశ యువతలో 7.1 శాతం కరోనా బారిన..
అంతేగాకుండా భారతదేశంలోని యువతలో 7.1 శాతం మంది జనాభా కరోనా బారినపడినట్లు ఐసీఎంఆర్ సెరో సర్వేలో గుర్తించారు. అయితే, వచ్చే పండగల రోజులు, శీతకాలం, పెద్ద ఎత్తున గుమిగూడటాన్ని రాష్ట్రాలు నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంతలో, ఈ ఫలితాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తూ.. ఐసిఎంఆర్ రెండవ సెరో-సర్వే నివేదిక ఫలితాలు భారతదేశంలో గణనీయమైన జనాభా ఇప్పటికీ కోవిడ్ -19 కి గురయ్యే అవకాశం ఉందని వెల్లడించిందని చెప్పింది..
హెర్డ్ ఇమ్యూనిటే తక్కువే.. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
ఆదివారం, రెండవ సెరో-సర్వే విడుదలకు ముందే, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. భారత జనాభా ఇంకా కరోనావైరస్ సంక్రమణకు వ్యతిరేకంగా మంద రోగనిరోధక శక్తి(హెర్డ్ ఇమ్యూనిటీ)ని సాధించలేకపోతోందని అన్నారు. అందుకే, ప్రార్థనా స్థలాలలో కూడా ముసుగులు ధరించాలని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశంలో కరోనా పరిస్థితులపై ఐసీఎంఆర్ పరిశోధనలు చేస్తోందని, వాటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే, ఈ సెరో సర్వే ప్రజల్లో ఆందోళనలకు దారితీయవద్దని అన్నారు. కాగా, 0.73 శాతం మందికే కరోనా సోకిందని మొదటి సెరో-సర్వే మే 2020 వెల్లడించింది. కరోనా నిబంధనలను పాటిస్తూ కరోనాను నియంత్రించేందుకు ప్రజలు సహకరించాలని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కోరారు.