టీవీల్లో 'లైవ్' వీక్షించే ప్రతీ పౌరుడు ప్రొటెం స్పీకరే: కర్ణాటక పరిణామాలపై చిదంబరం
బెంగళూరు: కర్ణాటకలో ఈ సాయంత్రం జరగబోయే బలపరీక్ష పైనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు నిలిచింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, జేడీఎస్ పోరులో అంతిమంగా గెలిచేదెవరు? అన్న ఉత్కంఠ క్షణక్షణానికి పెరుగుతోంది. అందరిని టీవిల ముందు అతుక్కుపోయేలా చేసింది. బలనిరూపణ సందర్భంగా.. టీవీల్లో ఆ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో ఈ సాయంత్రం అందరి ముఖాలు టీవిలకే అతుక్కుపోయే అవకాశం ఉంది.
ప్రధానంగా కాంగ్రెస్ జేడీఎస్, బీజేపీలలో ప్రత్యర్థిని ఓడించాలన్న కసి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు సైతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం వరుసగా పలు ఆసక్తికర ట్వీట్స్ చేశారు.
Live telecast ordered by Supreme Court will mean that every citizen watching television will be the Pro Tem Speaker!
— P. Chidambaram (@PChidambaram_IN) May 19, 2018
'సుప్రీంకోర్టుకు నేను సెల్యూట్ చేస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా రాజ్యాంగబద్దంగా వాళ్ల పార్టీల తరుపున నిలబడుతారు.' అని చిదంబరం ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.
'బలనిరూపణను వాయిదా వేయడానికి లేదా పక్కదోవ పట్టించడానికి బీజేపీ వేసిన ప్రతీ ఎత్తుగడ చిత్తయిపోయింది. ఇప్పుడు నేను నమ్మకంగా చెప్పగలను కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు యడ్యూరప్పను కచ్చితంగా ఓడిస్తారు' అని మరో ట్వీట్ లో చిదంబరం అభిప్రాయపడ్డారు.
ఇక ప్రత్యక్ష ప్రసారానికి సుప్రీం కోర్టు అనుమతించడంపై చిదంబరం మరో ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ లెక్కన టీవిల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతీ పౌరుడు ఒక 'ప్రొటెం స్పీకర్' అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
Every trick of the BJP to delay or derail the vote of confidence has been defeated. Now, I am sure the Congress and JDS MLAs will defeat Mr Yeddyurappa.
— P. Chidambaram (@PChidambaram_IN) May 19, 2018
కర్ణాటకలో ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నది కాదు. ఓటింగ్ వ్యవస్థను, వారి వారి ఓటర్ల తీర్పును వారు ఎంతమేరకు గౌరవిస్తారన్నదే ప్రధానం అని మరో ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.