ఆడబిడ్డ పుడితే ఆ గ్రామంలో పండగే పండగ!
జైపూర్: ఆడబిడ్డ పుడితే ఎక్కడ తమకు బరువు అవుతుందో అని భయపడే ఈ రోజులలో ఆ ఊర్లో ఆడ బిడ్డ పుట్టిందని తెలిస్తే ఊరి పండగ చేస్తారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి చిందులు వేసి ఆనందంలో మునిగిపోతారు.
రాజస్థాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలోని పిప్లాంత్రి గ్రామంలో ఉన్న ఈ ఆచారం గురించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ మొదలైయ్యింది. 2006వ సంవత్సరంలో మొదలైన ఈ ఆచారానికి ఆ గ్రామస్తులు ఇప్పటికి కట్టుబడి ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శం అయ్యింది.
ఆ గ్రామంలో ఎవరి ఇంటిలో ఆడబిడ్డ పుట్టినా అదే రోజు ఊరందరూ కలిసి 21 వేల రూపాయలు వసూలు చేస్తారు. తరువాత ఆడబిడ్డ తల్లిదండ్రుల దగ్గర రూ. 10 వేలు వసూలు చేస్తారు. 31 వేల రూపాయలు అమ్మాయి పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేస్తారు.
ఈ విధంగా డిపాజిట్ చేసిన నగదు ఆ అమ్మాయి పెళ్లి ఖర్చులకు ఉపయోగించాలి, ఇది కట్టుబాటు. ఆడబిడ్డ పుట్టిన తరువాత ఆ గ్రామస్తులు 111 పండ్ల మొక్కలు తీసుకుని వస్తారు. ఆడబిడ్డ పుట్టిన ఇంటి పరిసర ప్రాంతాలలో వాటిని నాటుతారు.
మిగిలిన మొక్కలు పరిసర ప్రాంతాలలో నాటుతారు. ఆడబిడ్డతో పాటు ఆ 111 మొక్కలు పెంచవసిన భాద్యత ఆ తల్లిదండ్రులదే. వాటి నుండి వచ్చే పండ్లను ఆ గ్రామంలోని మహిళలు మార్కెట్ లో విక్రయిస్తారు. ఈ విధంగా వచ్చిన సోమ్మును అదే గ్రామంలోని అమ్మాయిల చదువులకు, వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతారు.
2006లో అప్పటి గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ కుమార్తె కిరణ్ అనారోగ్యంతో మరణించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన కుమార్తె మరణించిన విధంగా ఈ గ్రామంలో ఏ అమ్మాయి మరణించరాదని శ్యామ్ సుందర్ ఆలోచించి ఈ ఆచారం అమలులోకి తీసుకు వచ్చారు.