ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్
ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్. కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో కశ్మీరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాము భూమి, ఉద్యోగాలు కోల్పోతామని ఆందోళన చెందొద్దని సూచించారు. మోహన్ భగవత్ మంగళవారం విదేశీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు.
80 జర్నలిస్టులతో ముఖాముఖి ..
50 మీడియా సంస్థలకు చెందిన 80 మంది విదేశీ జర్నలిస్టులు .. మోహన్ భగవత్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్ మందిరం, గో హత్యలు .. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర అంశాలపై చర్చించారు. జమ్ముకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఆరెస్సెస్ స్వాగతిస్తోందని తెలిపారు మోహన్ భగవత్. హిందుత్వం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని నొక్కి వక్కానించారు.
భారతీయులే
దేశంలో ప్రతి పౌరుడు భారతీయుడేనని .. భారతీయులంతా హిందువేనని స్పష్టంచేశారు. కుల రాజీయాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి సమాధానమిచ్చారు. దీంతోపాటు హోమో సెక్స్, ఎన్ఆర్సీ గురించి కూడా ఆన్సర్ చేశారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ అంటే .. జాబితాలో లేని వారిని వెనక్కి పంపించడం కాదన్నారు. వారు దేశ పౌరులు మాత్రమే కాదని క్లారిటీ ఇచ్చారు.
ఆరెస్సెస్ అండ దండ
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆరెస్సెస్ మద్దతు తెలుపుతుందని ప్రకటించారు. పౌరసత్వ సవరణ బిల్లులో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఆయా వర్గాల వారికి ప్రాధాన్యం ఉంటుందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ప్రపంచంలో హిందువులు అనే పదం ఒక్క భారతదేశంలో ఉన్నదని పేర్కొన్నారు. గో రక్షణ పేరుతో జరిగే దాడులను కూడా ఖండించారు మోహన్ భగవత్.
చర్యలు తప్పవు
మూక దాడులు చేసేవారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. హింస ఏ రకంగా ఉన్న ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. గో రక్షణ పేరుతో దాడులు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. గత పదేళ్ల యూపీఏ పాలనలో చేసిన తప్పులే నేటి ఆర్థికమాంద్యానికి కారణమైందని విమర్శించారు. వారు చేసిన చర్యలే పరిస్థితికి అద్దం పట్టిందని మండిపడ్డారు.