అనుక్షణం అప్రమత్తం..! త్రివిధ దళాలకు సెలవులు రద్దు చేసిన కేంద్రం..!!
ఢిల్లీ/ హైదరాబాద్ : సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్య అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. త్రివిధ దళాల సైనికుల సెలవులు రద్ధు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయం మేరకు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు సర్క్యూలర్లు జారీ చేశాయి. సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది. భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా సూచించింది. అలాగే భారతదేశం సర్జికల్ స్ట్రైక్ మరోసారి నిర్వహించింది. సరిహద్దుల వెంబడి నిఘా కోసం పాకిస్థాన్ సైన్యం డ్రోన్ ను ఉపయోగించింది. ఉదయం 6.30 గంటల సమయంలో పాక్ డ్రోన్ ను భారత సైన్యం పేల్చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాదు పాకిస్థాన్ భూభాగంలోని కైబర్ ఫంక్త్యూ లోను దాడులు చేపట్టింది. మొత్తం 12 జెట్ మిరేజ్ ఫైటర్లతో భారత వైమానిక దళం విరుచుకుపడింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంప్ లు, ఎయిర్ బేస్ ల వద్ద అప్రమత్తం చేశారు. దాడుల నేపథ్యంలో గుజరాత్ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ తెల్లవారు జామున భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా మిరేజ్ 2000 ఫైటర్ జెట్ లతో దాడులు చేశారు. మొత్తం 21 నిమిషాలలో ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారు 1000 కిలోల బాంబులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో సుమారు 300 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్ తేరుకునేలోపు పని ముగించేసింది. బాలాకోట్ లో తెల్లవారు జామున 3.45 గంటలకు దాడులు ప్రారంభించింది. తరువాత చకోటి, ముజఫరాబాద్ లో వరుసగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో జేషే మహ్మద్ ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్ ఆర్మీ తెలుసుకునేలోపు పని పూర్తి చేసింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చినా ఎదుర్కొనేందుకు భారత వైమానికళం సర్వసన్నద్ధంగా పహారా కాస్తోంది.