నిర్భయ డాక్యుమెంటరీ తప్పేం కాదు, ఎందుకు నిషేధం విధించారు: తండ్రి
న్యూఢిల్లీ: 2012లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఆధారంగా 'ఇండియా డాటర్' పేరుతో తీసిన డాక్యుమెంటరీ తప్పేం కాదని, ఎందుకు మన దేశంలో దానిపై నిషేధం విధించారని నిర్భయ తండ్రి ఓ ప్రముఖ టీవీ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు.
'ప్రతి ఒక్కరు ఆ చిత్రాన్ని చూడాలి. జైలులో ఉన్న ఓ వ్యక్తి (ముఖేశ్ను ఉద్దేశించి) అలా మాట్లాడుతున్నాడంటే.. అతడిని స్వేచ్ఛగా వదిలేస్తే ఇంక ఏం చేస్తాడో ఊహించుకోండి' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్నే ఆ డాక్యుమెంటరీలో చూపించారని, నేరస్తులపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దానికి మనం అంగీకరించడం తప్ప ఏమి చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు.
కాగా 'ఇండియా డాటర్' డాక్యుమెంటరీని బీబీసీ చానెల్కు చెందిన బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ లెస్లీ ఉడ్విన్ తీశారు. ఇందులో నిర్భయ తల్లిదండ్రులు, వైద్యులు, పోలీసులు, లాయర్లు, ఈ నేరానికి పాల్పడినవారిలో ఒకరిని ప్రశ్నించి దీనిని రూపొందించారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో ముకేశ్ సింగ్ ‘‘అత్యాచారం జరగడానికి అబ్బాయికి కంటే.. అమ్మాయే ఎక్కువ కారణం. రేప్ చేస్తే నిశ్శబ్దంగా చేయించుకోవాలి. అలా ఉంటే ఆమె మానాన ఆమెను వదిలేస్తాం. అంతేకానీ అరిచి గోల పెట్టడం, దాడిచేయడం వల్ల చిరాకు పుడుతుంది. దీంతో ప్రతి దాడే శరణ్యం'' అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
'ఇండియా డాటర్' డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనని, భారతదేశంలో వ్యక్తుల ఆలోచన విధానానికి, సమాజానికి ఆ డాక్యుమెంటరీ అద్దం పట్టేదిగా ఉందన్నారు. 2012లో తన కూతురుకు జరిగిన అన్యాయాన్ని బీబీసీ డాక్యుమెంటరీగా తీసిందని చెప్పారు.
ఇక నిర్భయపై అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడిన ముకేశ్ సింగ్ ఇంటర్వ్యూ ఉన్న డాక్యుమెంటరీని విదేశాల్లో సహా ఎక్కడా ప్రసారం కానీ, ప్రచురణ కానీ కాకుండా చూస్తామని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాతో సహా, ఎక్కడ కూడా ఆ డాక్యుమెంటరీని టెలికాస్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని బీబీసీ, భారతీయ విదేశాంగ శాఖ, సమాచార సాంకేతిక విభాగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్యుమెంటరీ ప్రసారం, ప్రచురణ కాకుండా చూస్తామని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా, 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి.. ఢిల్లీలో తన స్నేహితుడితో బస్సులో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అ త్యాచారం చేసి, బస్సు నుంచి తోసేశారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమె సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురిలో ఒకరైన ముకేశ్ సింగ్.. తనకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే.