వీసీ పోస్టుకి 14 కోట్లు: ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ పోస్టుకి 14 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తమిళనాడు కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ చీఫ్ ఈవీకేఎస్ ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలు విలువలను మరిచాయన్నారు.
యూనివర్సిటీల ద్వారా ప్రభుత్వం ధనార్జనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రూ. 12 కోట్ల నుంచి 14 కోట్ల రూపాయలు చెల్లించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టే వ్యక్తులు ఆయా విద్యాసంస్థలను ఫక్తు వ్యాపార సంస్థలుగా మార్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కారణం చేత వీసీలు పేద, దళిత వర్గాలు ఉన్నత విద్యనభ్యసించేందుకు సముఖంగా లేరని ఆయన పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ముగ్గురు వైద్య విద్యార్ధినిలు ఆత్మహత్యలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాలేజీలో కనీస మౌలిక సదుపాయలు లేవని ఇటీవల ముగ్గురు కాలేజీకి సమీపంలోని ఓ బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
మోనిషా, ప్రియాంక, శరణ్యలు అనే విద్యార్ధినిలు విల్లుపురం జిల్లా కుల్లకురుచిలోని ప్రైవేట్ విద్యాసంస్థ ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ ఆఫ్ న్యూరోపతి అండ్ యోగా సైన్సెస్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నారు. తమ చావుకు కాలేజీ యాజమాన్యమే కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించారు.