ఈవీఎం ట్యాంపరింగ్ ఇష్యూ: ఏదో ఓ పార్టీ ఇష్యూ కాదు.. కపిల్ సిబాల్ ఏం చెప్పారంటే?
న్యూఢిల్లీ: సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా.. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ సోమవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. లండన్లో జరిగిన కార్యక్రమంలో షుజా మాట్లాడుతూ... 2014 ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చునని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఉన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఏదో ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదని చెప్పారు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన సమస్య అన్నారు.
తాను లండన్కు వెళ్లింది వ్యక్తిగత కారణాల మీద అని చెప్పారు. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ లండన్ అధ్యక్షుడు ఆహ్వానించడంతో తాను ఈ కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్తో సహా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించినట్లు వారు చెప్పారని అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షఇంచుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చెప్పారు. సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా గురించి తనకు ఏమాత్రం తెలియదని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్రం కచ్చితంగా విచారణ జరిపించాలన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులకు మంగళవారం లేఖ రాసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం, ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా పైన చర్యలు తీసుకోవాలని ఈసీ కోరింది.