ట్యాంపరింగ్ దుమారం, ఈసీ సీరియస్ : సైబర్ నిపుణుడు షుజాపై ఫిర్యాదు
ఢిల్లీ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. 2014 నాటి ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్ చేశారంటూ... సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. షుజా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. అందులోభాగంగా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈసీ అధికారులు. ఆయనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
సోమవారం నాడు లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో సయ్యద్ షుజా మాట్లాడారు. 2014 నాటి జనరల్ ఎలక్షన్లలో ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్లు వ్యాఖ్యానించారు. సదరు ఈవీఎంలను సాంకేతికపరంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) టీములో తాను కూడా సభ్యుడినంటూ చెప్పుకొచ్చారు. 2009 నుంచి ఐదేళ్లపాటు అంటే 2014 వరకు ఈసీఐఎల్ లో తాను పనిచేసినట్లు తెలిపారు. అయితే ఈవీఎం లను హ్యాక్ చేయొచ్చా అనే విషయంలో పరిశోధన చేశామన్నారు. ఆ క్రమంలో ట్యాంపరింగ్ సాధ్యమేనన్న విషయం నిరూపించామని చెప్పారు. అంతేకాదు తాను చేస్తున్న ఆరోపణలకు నిజ నిర్ధారణగా తగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అదలావుంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాడిన ఈవీఎం లను కూడా హ్యాక్ ఎలా చేయొచ్చో నిరూపిస్తా అంటూ సంచలన కామెంట్లు చేశారు.