ఈవీఎంలలో ట్యాంపరింగ్ సాధ్యమా, ఈసీ ఏం చెప్తోంది?
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఓట్లు బీజేపీకి పడేలా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపిస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఈసీ స్పందించింది. ఈవీఎంలను
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఓట్లు బీజేపీకి పడేలా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపిస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఈసీ స్పందించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేరని తెలిపింది.
పంజాబ్, గోవాల్లో ఓటమిపై ఏఏపీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరారు.
దేశంలో 2000 సంవత్సరం నుంచి ఈవీఎంలను వాడుతున్నారు. అంతకుముందు ప్రయోగాత్మకంగా 1982లో వీటిని ఉపయోగించారు. అది విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకొచ్చారు.
ఇదివరకే చాలాసార్లు ఈవీఎంల విశ్వసనీయతపై ఆరోపణలు వచ్చాయి. 2001లో ఇలాంటి ఆరోపణలు రాగా మద్రాస్ హైకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. 2002లోనూ కేరళ హైకోర్టు కూడా ఇలాంటి వాదనలను తోసిపుచ్చింది.
2004లో కర్ణాటక హైకోర్టు, 2005లో ముంబయి హైకోర్టు సైతం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. ఈవీఎంలను మెకానికల్గా గానీ, ఎలక్ట్రికల్గా గానీ ట్యాంపరింగ్ చేయడం కుదరదు.
అందులో వన్ టైమ్ ప్రోగాం చేస్తారు. దీనివల్ల ట్యాంపరింగ్ చేయడానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఈవీఎంలు ఉపయోగించేటప్పుడు ఎలాంటి నెట్ వర్క్ కేబుళ్లనూ దానికి అనుసంధానించరు. ఎలాంటి వైర్లెస్ పరికరాలతో నియంత్రించలేరు.
ఈవీఎం ఉత్పత్తి చేసే దగ్గరే అవి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం పని చేస్తున్నాయా లేదా అనేది అక్కడి సిబ్బంది పరిశీలిస్తారు. ఈవీఎంల పని తీరును అక్కడ ఉండే, స్వతంత్రంగా వ్యవహరించే నిపుణుల బృందం కూడా తరచూ పరిశీలిస్తుంది.
ప్రతీ ఎన్నిక సమయంలో ప్రతి ఈవీఎంనూ ప్రాథమికంగా తనిఖీ చేస్తారు. ఇది వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇంజినీర్లు చేపడతారు. ఒకవేళ ఆ సమయంలో ఈవీఎంలో లోటుపాట్లు తలెత్తితే వాటిని ఎన్నికల్లో ఉపయోగించరు.
ఆ సమయంలో పార్టీ ప్రతినిధులు కూడా ఓటు వేసి పరిశీలిస్తారు. పోలింగ్ రోజు కూడా ప్రతీ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలను వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి తనిఖీ చేపడతారు.
50 ఓట్ల వరకూ మాక్ పోలింగ్లో భాగంగా చేపడతారు. సభ్యులందరి ఆమోదం తర్వాతే ఓటింగ్ చేపడతారు. పోలింగ్ తర్వాత కూడా ఈవీఎంలలో ఎలాంటి మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు.
పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తారు. అక్కడ 24 గంటలూ నిఘా కొనసాగుతుంది. అందువల్ల మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టే వరకూ ఈ నిఘా కొనసాగుతుంది. కాబట్టి ఈవీఎంలపై అనుమానాలు అవసరం లేదంటున్నారు.