లాడ్జిలో ఈవీఎంలు.. అధికారుల ఉరుకులు పరుగులు.. కలెక్టర్కు షోకాజ్ నోటీసులు
ముజఫర్పుర్ : ఫుల్ సెక్యూరిటీ మధ్యన ఉండాల్సిన ఈవీఎంలు లాడ్జిలో దర్శనమిచ్చాయి. పోలింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూముకు తరలించాల్సిన అధికారి తనతో పాటు హోటల్ రూముకు తీసుకెళ్లడం దుమారం రేపింది. బీహార్ లోని ముజఫర్పుర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలింగ్ డ్యూటీ అయిపోయాక సెక్టార్ ఆఫీసర్ తనతో పాటు హోటల్ గదికి ఆరు ఈవీఎంలు తీసుకెళ్లారని తెలిపారు జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఘోష్. దానికి సంబంధించి డిపార్టుమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించామని చెప్పారు.
సెల్ఫీల పిచ్చి.. కేసులు నమోదు.. స్మార్ట్ఫోన్లతో తంటాలు
సోమవారం నాడు బీహార్ లో ఐదో విడత లోక్ సభ ఎన్నికలు జరిగాయి. సితామర్హి, మధుబని, ముజఫర్పుర్, సారన్ అండ్ హజిపూర్ సెగ్మెంట్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే ముజఫర్పుర్ లో ఎన్నికల ప్రక్రియ ముగిశాక సెక్టార్ ఆఫీసర్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూముకు తరలించాల్సింది పోయి తన వెంట తీసుకెళ్లారు. ఆ మేరకు పోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ కలెక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. స్ట్రాంగ్ రూముకు వెళ్లాల్సిన ఈవీఎంలు హోటల్ రూముకు ఎలా వెళ్లాయనే దానిపై ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంది.
అదలావుంటే సెక్టార్ ఆఫీసర్ ఎన్నికల నియమావళిని అతిక్రమించారని కలెక్టర్ చెబుతున్నారు. డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు పూర్తిస్థాయిలో సదరు అధికారిని విచారిస్తామన్నారు. ఆయన దగ్గరున్న రిజర్వ్డ్ ఈవీఎంలు ఇచ్చి.. వాటి స్థానంలో రెండు బ్యాలెట్ ఈవీఎంలతో పాటు ఒక కంట్రోల్ యూనిట్ రెండు వీవీ ప్యాట్ యంత్రాలను తనతో పాటు తీసుకెళ్లారని చెప్పారు. లాడ్జిలో ఈవీఎంలు దొరికాయనే ప్రచారంతో స్థానికులు ఆందోళకు దిగారు. మొత్తానికి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే గానీ అసలు ఈవీఎంలు హోటల్ రూముకు ఎందుకు వెళ్లాయనే విషయం బయటపడదేమో.