కూతురుపై పోలీసుల రేప్: మాజీ జవాను ఆత్మహత్య
న్యూఢిల్లీ: హర్యానా సచివాలయం ఎదుట బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మాజీ జవాన్ అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. తన మైనర్ కూతురుపై సోనిపట్ పోలీసు అధికారులు తరచూ అత్యాచారం జరుపడంతో కలత చెందిన ఆ కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆయన వద్ద లభించిన ఆత్మహత్య లేఖ ప్రకారం.. ఈ మాజీ సైనికుడు సోనిపట్ జిల్లా ఖర్ఖోడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిసానా గ్రామానికి చెందినవాడు. తన బలవన్మరణానికి తన రెండో భార్య, ఖర్ఖోడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు కారణమని ఆయన తన లేఖలో తెలిపాడు.
పోలీసు అధికారులు తరచూ తన ఇంటికి వచ్చి తన మైనర్ కూతురిపై అత్యాచారం జరిపేవారని ఆయన తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ వైద్యుడిపై ఎమ్మెల్యే కుమారుడి దాడి
ఓ ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడిపై దాడి చేసి కొట్టిన ఘటన బీహార్లో చోటుచేసుకుంది. అధికారంలో ఉన్న ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే కుమారుడు గయ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడిపై బుధవారం రాత్రి దాడి చేశాడు.
స్థానిక జేడీయూ నేత హత్య కేసులో నిందితుడిగా ఉన్న రంజిత్ యాదవ్ ఎనిమిది మందితో కలిసి దౌర్జన్యంగా ఆస్పత్రిలోకి ప్రవేశించి డ్యూటీలో ఉన్న డాక్డర్పై దాడి చేశారు. రంజిత్ వీల్ ఛైర్తో తనను కొట్టాడని.. అతడిని చూస్తుంటే తనను చంపడానికి వచ్చినట్లు అనిపించిందని బాధిత డాక్టర్ సత్యేంద్ర కుమార్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గయ సబ్ ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ వెల్లడించారు.