బిగ్ సెన్సేషన్: మంత్రి సెక్స్ స్కాండల్ లీక్, జర్నలిస్ట్ వినోద్ అరెస్ట్.. 500సీడీలు!
జర్నలిస్టు వినోద్ వర్మ బీజేపీ ఆరోపణలను ఖండించారు. నిజానికి ఆ వీడియో వర్మ వద్ద నుంచి ఎలా లీకైందనే దానిపై కూడా స్పష్టత లేదు.
రాయ్పూర్: ఓ ఛత్తీస్గఢ్ మంత్రి రాసలీల వ్యవహారాన్ని బీబీసీ మాజీ సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడైన వినోద్ వర్మ బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఛత్తీస్గఢ్ బీజేపీ మాత్రం ఇదంతా ప్రతిపక్ష కాంగ్రెస్ కుట్ర అని, సదరు జర్నలిస్టు కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడని ఆరోపిస్తోంది.
జర్నలిస్టు వినోద్ వర్మ బీజేపీ ఆరోపణలను ఖండించారు. నిజానికి ఆ వీడియో వర్మ వద్ద నుంచి ఎలా లీకైందనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ గత కొంతకాలంగా వర్మ తన వద్ద ఓ ముఖ్య నేతకు సంబంధించిన సెక్స్ క్లిప్ ఉందంటూ చెబుతూ వస్తున్నారు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ నేత ప్రకాశ్ బజాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వినోద్ వర్మ అరెస్ట్
ఈ నేపథ్యంలో శుక్రవారం ఘజియాబాద్లో పోలీసులు వినోద్ను అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా ఓ జాతీయ మీడియా ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. సదరు మంత్రి పేరు కూడా వర్మ బయటపెట్టారు. ఆ సెక్స్ క్లిప్ లో ఉన్నది పీడబ్ల్యూ శాఖా మంత్రి రాజేష్ మునత్ అని చెప్పారు. ఇదే విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐ కూడా ప్రచురించింది.
ఇరికించారన్న వినోద్ వర్మ
మంత్రికి సంబంధించిన వ్యవహారం కావడంతోనే ఇందులో తనను ఇరికించారని వినోద్ వర్మ ఆరోపించారు. కాగా, వినోద్ వర్మ అరెస్టుకు ముందు న్యూఢిల్లీలోని ఓ వీడియో పార్లర్ పై పోలీసులు దాడి చేశారు. దాదాపు వెయ్యి సీడీలను తయారుచేసి ఇవ్వాల్సిందిగా వినోద్ వారిని కోరినట్టు సమాచారం సేకరించారు.
వెయ్యి సీడీలు
సీడీ షాపు నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో వినోద్ వర్మ ఇంటిపై దాడి చేయగా.. 500సీడీలు, పెన్ డ్రైవ్ లభ్యమైనట్టు తెలుస్తోంది. అయితే వాటిల్లో ఉన్న సమాచారం మాత్రం బయటకు రాలేదు. అరెస్ట్ అనంతరం విచారణ నిమిత్తం ఆయనను రాయ్పూర్కి తరలిస్తున్నారు.
నిఘా పెట్టారన్న సీఎం
ఘటనపై బీజేపీ మండిపడుతోంది. వినోద్ వర్మ ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ బాఘెల్కు అత్యంత సన్నిహితుడని.. గత కొంత కాలం వాళ్లంతా బీజేపీ నేతల సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత వ్యవహారాలపై నిఘా పెట్టారని స్వయంగా సీఎం రమణ సింగే ఆరోపించడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యవహారాన్ని తప్పుపడుతోంది. తమ పరువు పోకూడదనే బీజేపీ లేని పోని ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.