మహారాష్ట్ర కాంగ్రెస్కు షాక్ : బీజేపీలోకి రాధాకృష్ణ, మరో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ?
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలతో నేతలు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ పూర్తి ఆధిక్యం ప్రదర్శించడంతో ఆ పార్టీ వైపు నేతలు చూస్తున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో కూడా అదే సిచుయేషన్ నెలకొంది. కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఫడ్నవీస్తో భేటీ ..
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ విఖే పాటిల్ మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నిన్న ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సీఎంను కలువడంతో .. బీజేపీలో చేరతారనే ఊహగానాలకు బలం చేకూరింది. అంతేకాదు వచ్చే మంత్రివర్గ విస్తరణలో రాధాకృష్ణకు మంత్రి పదవీ దక్కుతుందని ప్రచారం జరగుతుంది. ఈ క్రమంలో రాధాకృష్ణ ... ఫడ్నవీస్తో భేటీకి హైప్ క్రియేట్ అయ్యింది. తన ఎమ్మెల్యే పదవీకి సోమవారం రోజునే రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ కారణాలు ..
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సందర్భంగా తాను పార్టీకి వీడటానికి గల కారణాలను రాధాకృష్ణ వివరించారు. గత లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల కోసం తాను ప్రచారం చేయించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన నేతగా ఉన్న తనపై కాంగ్రెస్ పార్టీ అవలంభించిన వైఖరి అర్థం కావడం లేదన్నారు. తాను పార్టీ కోసం పనిచేస్తుంటే .. హైకమాండ్ పెద్దలు పట్టించుకోలేదని ... పార్టీ పెద్దల తీరుతో విసిగెత్తి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణతోపాటు మాజీ మంత్రి అబ్దుల్ సత్తార్ కూడా పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే సత్తార్ తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కానీ రాధాకృష్ణ మాత్రం పార్టీలో చేరే విషయాన్ని చెప్పకుండా .. నేరుగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో సమావేశమై ... కాషాయ కండువా కప్పుకోబోతున్నానని సంకేతాలిచ్చారు.
బోసిపోయేనా ?
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాధాకృష్ణ కీలక నేత. ఆయన పార్టీని వీడటంతో ఇక్కడ హస్తం పార్టీని పునర్ వైభవం తీసుకొచ్చే నేత లేని పరిస్థితి. రాధాతోపాటు సత్తార్ కూడా హస్తానికి చేయ్యివ్వడంతో .. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మిగిలే నేతలెవరు అనే ప్రశ్న తలెత్తింది. దీనికి తగ్గట్టు మరో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని సత్తార్ పేర్కొనడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి హైకమాండే ప్రధాన కారణమని సత్తార్ బాహాటంగానే విమర్శించడం రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది.
నేతలేరీ ? ప్రజాప్రతినిధులేరీ ?
ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. లోక్ సభ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలో రాధా, సత్తార్ పార్టీని వీడటంతో ఆ పార్టీ కీలక నేతలను కోల్పోయినట్లైంది. దీంతోపాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే .. ఆ పార్టీ మహారాష్ట్రలో అస్థిత్వం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ... ప్రధాన నేతలు బీజేపీలో చేరి మరింత బలవంతం అవుతుండగా .. కాంగ్రె్స్ పార్టీ బలహీనంగా మారుతుందని పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ కూడా తన పదవీకి రాజీనామా చేస్తాననే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ .. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి రాహుల్ ఒక్కరే కారణం కాదు .. మనం కూడా బాధ్యులమే అని చవాన్ చెప్తున్నారు.