రాత్రంతా సీబీఐ లాకప్ లో చిదంబరం: కునుకు లేకుండా..భోజనం చేయకుండా!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం రాత్రంతా సీబీఐ లాకప్ లోనే గడిపారు. ఆయనను అరెస్టు చేసిన అనంతరం అధికారులు నేరుగా తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించారు. అరెస్టయిన ఆందోళన వల్ల చిదంబరం రక్తపోటులో హెచ్చుతగ్గులు నమోదైనట్లు డాక్టర్లు తెలిపారు. అంతకుమించి ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా- అరెస్టయిన సమాచారం తెలుసుకున్న కార్తి చిదంబరం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. అరెస్టు జరిగే సమయానికి చెన్నైలో ఉన్న కార్తి చిదంబరం.. గురువారం తెల్లవారు జామున ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఆసుపత్రికి బదులుగా హెడ్ క్వార్టర్ కు
చిదంబరాన్ని అరెస్టు చేసిన తరువాత ప్రత్యేక వాహనంలో సీబీఐ అధికారులు ఆయనను తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తదుపరి చర్యలను చేపట్టడానికి వీలుగా ఆయనను తమ అదుపులోనే ఉంచుకున్నారు. సాధారణంగా ఎవరైనా ప్రముఖులను అరెస్టు చేసిన వెంటనే అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. చిదంబరం విషయంలో సీబీఐ అధికారులు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. చిదంబరాన్ని ఆసుపత్రికి తరలించలేదు. నేరుగా తమ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. అఖిల భారత వైద్య విజ్ఝాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులను ప్రధాన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అక్కడే వైద్య పరీక్షలు చేశారు.
భోజనం చేయని చిదంబరం..
సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తరువాత చిదంబరం ఆహారాన్ని తీసుకోలేదని తెలుస్తోంది. తేలికపాటి ఆహారాన్ని అధికారలు అందజేసినప్పటికీ.. ఆయన దాన్ని స్వీకరించలేదని సమాచారం. తనకు కొన్ని మాత్రలు అవసరమయ్యాయని చిదంబరం సూచించగా.. వాటిని ఇచ్చినట్లు చెబుతున్నారు. మాత్రలు తీసుకోవాలనే ఉద్దేశంతో.. స్వల్పంగా ఆహారాన్ని తీసుకున్నారని అంటున్నారు. రాత్రంతా ఆయన సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆందోళనతో గడిపారని తెలుస్తోంది. ఎవ్వరితోనూ ఫోన్ లో మాట్లాడే అవకాశాన్ని కల్పించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాశ్మీర్ అంశాన్ని మరుగుపర్చడానికే
ఈ సందర్భంగా కార్తి చిదంబరం చెన్నై విమానాశ్రయంలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ అంశం నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికే కేంద్రం కుట్ర పూరితంగా తన తండ్రిని అరెస్టు చేసిందని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని అన్నారు. దీనికోసం రాజ్యాంగబద్ధమైన సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలను వినియోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబానికి అండగా ఉందని అన్నారు. పార్టీ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు ఆయన కృతజ్ఒతలు తెలిపారు. న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ.. అకారణంగా రాజకీయపరమైన కక్షసాధింపు చర్యలకు భారతీయ జనతాపార్టీ పాల్పడుతోందని కార్తి చిదంబరం విమర్శించారు.