చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో బుధవారం రాత్రి అరెస్టైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నంలోగా కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. బుధవారం రాత్రి చిదంబరం నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. చిదంబరంను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
చిదంబరం ఇంటి వద్ద బుధవారం రాత్రి కొద్దిగంటలపాటు హైడ్రామా నడిచింది. చిదంబరం స్వయంగా వచ్చి లొంగిపోవడంతో సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చిదంబరంకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మంగళవారం నుంచే చిదంబరంను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆయన ఇంటి వద్ద కాపు కాశారు.
చిదంబరం నివాసానికి నోటీసులు కూడా అంటించారు. సుప్రీంకోర్టులో కూడా చిదంబరంకు ఊరట లభించకపోవడంతో ఆయనే సీబీఐ ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం చిదంబరంను సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది ఇలావుంటే, బీజేపీ ప్రభుత్వం చిదంబరంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారనే చిదంబరంను లక్ష్యం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరంను అవమానకరంగా వెంటాడుతున్నారని మండిపడ్డారు.