కాంగ్రెస్కు మరో దెబ్బ: హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ రాజీనామా, సోనియాకు 4 పేజీల లేఖ
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలింది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వదిలి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా మాజీ మంత్రి అశోక్ తాన్వార్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన హర్యానా పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు. అయితే గతనెలలో పీసీసీ చీఫ్ పదవీ నుంచి తప్పించారు. దీంతో నొచ్చుకున్న అశోక్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అశోక్ తాన్వార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తన రాజీనామాకు గల కారణాలను నాలుగు పేజ్రీలో పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించినట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు నెలకొన్నాయని చెప్పారు. అందుకోసమే ప్రధాన నేతలు విసుగెత్తి పార్టీ మారుతున్నారని ప్రస్తావించారు.
రక్తం ధారపోస్తే ..
హర్యానా కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కృషి చేశానని అశోక్ పేర్కొన్నారు. తన రక్తాన్ని ధారపోసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేశానని తెలిపారు. తన చెమటతో పార్టీకి ఇంత చేస్తే తనపైనే పార్టీలో అసమ్మతి రాజేశారని ప్రస్తావించారు. అంతేకాదు హర్యానా ఎన్నికలకు సంబంధించి కొందరు టికెట్ల పేరుతో డబ్బులు వసూల్ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం తాను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో తనవైపే లేనిపోని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
సోనియా ఇంటి వద్ద నిరసన కూడా
హర్యానా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిరసిస్తూ ఢిల్లీలో సోనియాగాంధీ నివాసం ఎదుట కూడా ఇదివరకు అశోక్ నిరసన చేపట్టారు. కానీ ఆశించిన స్పందన రాకపోవడంతో చేసేదేమీ లేకపోయింది. తన వాదనను హైకమాండ్ పెద్దలు వినడం లేదని వాపోయారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్గా అశోక్ ఉన్న సమయంలో మాజీ సీఎం భూపిందర్ హుడా నుంచి వ్యతిరేకత వచ్చింది. అశోక్ను పీసీసీ చీఫ్ పదవీ నుంచి తప్పించాలని ఆయన పావులు కదిపారు. గత నెలలో కుమారీ షెల్జాకు బాధ్యతలు అప్పగించడంలో కీ రోల్ పోషించారు. పార్టీలో తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని భావించిన అశోక్ ఇవాళ పార్టీ పదవీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.