15 వేలమందికి ఉద్యోగాలు సృష్టించిన మాజీ లెక్చరర్
గౌహతి: మాజీ అధ్యాపకులు ఒకరు 15వేల ఉద్యోగాలను సృష్టించాడు. ఇందుకుగాను ఆయన అవార్డు కూడా అందుకున్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లో యువతకు శిక్షణ ఇచ్చి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాడు. ఇందుకు గాను ఆయన స్క్వాబ్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంటర్ప్రెన్యూయర్ షిప్ అవార్డు దక్కించుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో, ప్రధానంగా నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆయన చాలామంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అతని పేరు ఘనత నెయ్షూట్ డౌలో. ఆయన నాగాలాండ్లోని ఓ కాలేజీలో ఎకనమిక్స్ లెక్చరర్గా పని చేశారు.
ఈ రెండు రాష్ట్రాలలో యువతకు ఆయన శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, జుబిలంట్ భారతీయ ఫౌండేషన్ సన్నిహిత సహకారంతో ష్వాబ్ ఫౌండేషన్ ఈ అవార్డును ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఉన్నప్పటికీ లెక్చరర్ ఉద్యోగానికి డౌలో రాజీనామా చేశారు.
యువతకు ప్రాథమిక నైపుణ్యాలను నేర్పేందుకు ఎంటర్ప్రెన్యూవర్స్ అసోసియేట్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. చిన్న తరహా సంస్థల ఏర్పాటుకు అవసరమైన మూల ధనాన్ని, మార్కెటింగ్ నెట్వర్క్ను సమకూర్చారు. డౌలో 1992లో ఆశా దీపం పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
యువత కనీసం చిన్న స్థాయి ఉద్యోగాలనైనా చేపట్టేలా ప్రేరేపించారు. అది అంతగా సక్సెస్ కాలేదు. దీంతో తిరిగి ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత 2000లో ఆయన దీనిని స్థాపించి, సక్సెస్ అయ్యారు.
దీనిపై ఆన మాట్లాడారు. తాను నిర్వహిస్తున్న ఎంటర్ప్రెన్యూవర్స్ అసోసియేట్స్ను ప్రారంభించినపుడు తమలో 13 మంది రూ.500 చొప్పున విరాళం, ఒక రోజు వేతనం కార్పస్ ఫండ్ ఇచ్చారన్నారు. ప్రారంభ మూలధనం రూ.7,500 అని చెప్పారు.
గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం, తోలు బెల్టులు, బ్యాగులను అమ్మడంతో ప్రారంభించామన్నారు. దీంతో తమకు కొన్ని రూ.లక్షలు వచ్చాయన్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి విరాళాలు సేకరించామన్నారు. ప్రస్తుతం సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలనుకునే యువతకు 16 శాతం వడ్డీతో రుణాలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా తమ సంస్థలో రుణాలు పొందారన్నారు.