ఆదర్శ్ కుంభకోణంలో కాంగ్రెస్ నేతకు ఊరట! రాహుల్ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్కు కలిసొస్తున్న కాలం?
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేసులో మాజీ సీఎం అశోక్ చవాన్ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించగా, తాజాగా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.
ముంబై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన వేళా విశేషం ఏంటోగానీ ఆ పార్టీ వారికి అన్నీ శుభ పరిణామాలే ఎదురవుతున్నాయి. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం అశోక్ చవాన్ను విచారించరాదని బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేసులో మాజీ సీఎం అశోక్ చవాన్ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించగా, వాటిని తాజాగా బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.
సీఎం మెడకు చుట్టుకున్న ఫ్లాట్ల కేటాయింపులో అక్రమాలు...
కార్గిల్ అమరవీరుల కోసం ముంబైలో నిర్మించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 బహుళ అంతస్తుల భవన సముదాయంలోని ఫ్లాట్లను పలువురు ఆర్మీ అధికారులు, రాజకీయ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా కేటాయించుకున్నారు. ఈ కుంభకోణంలో అప్పటి మహారాష్ట్ర సీఎంగా ఉన్న అశోక్ చవాన్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి...
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో మాజీ సీఎం అశోక్ చవాన్ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించారు. గతేడాది ఏప్రిల్లో చవాన్పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు అనుమతి ఇచ్చారు. దీంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.
కాంగ్రెస్కు అనుకూల పవనాలు...
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక ఆ పార్టీకి, నాయకులకు కాలం కలిసొస్తున్నట్లే ఉంది. మొన్నటికి మొన్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గతంలో కంటే కాంగ్రెస్ మెరుగైన స్థానాలు గెలుచుకుంది. రాహుల్ అధ్యక్షుడయ్యాకే 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులోనూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా యూపీఏకు అనుకూలమైన తీర్పునిచ్చింది. ఈ కేసులో సీబీఐ పేర్కొన్న 14 మంది నిందిలూ నిర్దోషులేనని పటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి ఓపీ షైనీ ప్రకటించారు. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళి, టెలికమ్ శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహరాలకు ఈ తీర్పుతో ఊరట లభించింది. సీబీఐ న్యాయస్థానం తీర్పును చిదంబరం, మన్మోహన్ సింగ్ లాంటి సీనియర్ నేతలు కూడా స్వాగతించారు.
బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు...
చవాన్ను విచారించేందుకు 2013లో కూడా అప్పటి గవర్నర్ కే శంకర్ నారాయణన్ అనుమతి నిరాకరించారు. అయితే ఆ తరువాత గవర్నర్గా వచ్చిన విద్యాసాగర్ రావు మాత్రం చవాన్ను విచారించేందుకు అనుమతినిచ్చారు. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు తనపై రాజకీయంగా కక్ష సాధిస్తోందని, తన ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతిని కావాలనే ఇప్పించారని అశోక్ చవాన్ విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎం అశోక్ చవాన్ను విచారించరాదని బాంబే హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేయడం ఆయనకు ఊరట కలిగించే అంశమే.