బొగ్గు కుంభకోణం : చిన్న హోటల్తో మొదలై... దిగ్గజ నేతగా ఎదిగి... అంతలోనే అనూహ్య పతనం...
బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్కి ఢిల్లీ సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధించింది. ఆయనతో పాటు వాజ్పేయి హయాంలో బొగ్గు మంత్రిత్వ శాఖలో పనిచేసిన సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ,నిత్యానంద్ గౌతమ్లకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అక్టోబర్ 6న వీరిని దోషులుగా తేల్చిన కోర్టు తాజాగా వీరి శిక్షలు ఖరారు చేసింది. బొగ్గు కుంభకోణంలో ఓ కేంద్ర మాజీ మంత్రికి శిక్ష పడటం ఇదే తొలిసారి. ఒకప్పుడు ఒడిశా రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందిన దిలీప్ రాయ్కి జైలు శిక్ష పడటం అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈఎస్ఐ కుంభకోణం : దేవికా రాణిపై ఈడీ కేసు నమోదు
1982లో ఓ చిన్న హోటల్తో...
1982లో ఒడిశాలో ఓ చిన్న హోటల్తో దిలీప్ రాయ్ ప్రయాణం మొదలైంది. అనతికాలంలోనే ఆ హోటల్కు మంచి గుర్తింపు,ఆదరణ రావడంతో దాన్ని విస్తరించుకుంటూ పోయారు. అలా ఇప్పుడు Mayfair group పేరుతో ఆ ఐదు రాష్ట్రాల్లో ఆ హోటల్స్ పనిచేస్తున్నాయి. హోటల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మూడేళ్లకు.. అంటే 1985లో రూర్కెల్ కౌన్సిల్ ఛైర్మన్గా ఎన్నికవడంతో దిలీప్ రాయ్ రాజకీయ ప్రయాణం మొదలైంది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ టికెట్పై రూర్కెలా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత 1990లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికై.. అప్పటి ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.
వాజ్పేయి హయాంలో బొగ్గు మంత్రిగా...
ఆ తర్వాత 1996,2002లో రెండు పర్యాయాలు దిలీప్ రాయ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దేవెగౌడ హయాంలో,అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్పేయి హయాంలో బొగ్గు శాఖ మంత్రిగా పనిచేసిన దిలీప్ రాయ్... జార్ఖండ్లోని గిరిదహ్ జిల్లా బ్రహ్మదిహ బొగ్గు గనులను నిబంధనలకు విరుద్దంగా కాస్ట్రన్ టెక్నాలజీ అనే కంపెనీకి కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే సీబీఐ కేసు నమోదు చేయడం,సీబీఐ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేయడం జరిగింది.
బీజేడీ స్థాపనలో కీలక పాత్ర...
అంతర్ముఖుడిగా పేరు పొందిన దిలీప్ రాయ్ ఎప్పుడూ లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. కానీ ఆయన తలుచుకుంటే ఏ పనైనా జరుగుతుందన్న అభిప్రాయం ఒడిశా రాజకీయ వర్గాల్లో ఉంది. దివంగత ముఖ్యమంత్రి,దిగ్గజ జనతాదళ్ నేత బిజూ పట్నాయక్ను దిలీప్ రాయ్ తన రాజకీయ గురువుగా భావిస్తారు. పట్నాయక్ తన చివరి రోజుల్లో దిలీప్ వద్దనే గడిపాడు. ఆ సందర్భంగా ఒడిశాలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే బిజూ పట్నాయక్ కన్నుమూయడంతో.. దిలీప్ రాయ్,విజయ్ మోహపాత్ర మరికొందరు నేతలు కలిసి 1997లో బిజూ జనతా దళ్ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో పార్టీ బాధ్యతలు దిలీప్ రాయ్నే చేపట్టాలని దివంగత బిజూ పట్నాయక్ సతీమణి జ్ఞాన్ పట్నాయక్ కోరగా... అందుకు ఆయన తిరస్కరించారు. పట్నాయక్ కుటుంబం నుంచే ఎవరైనా బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని దిలీప్ అభిప్రాయపడ్డారు.
2002లో బీజేడీ నుంచి బహిష్కరణ
మొదట్లో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు సంశయించిన ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్... ఎట్టకేలకు ఆ బాధ్యతలను చేపట్టి బీజేడీపై పట్టు సాధించారు. 2000 సంవత్సరంలో బీజేపీతో కలిసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదే క్రమంలో 2002లో దిలీప్ రాయ్తో రాజకీయ విబేధాల కారణంగా నవీన్ పట్నాయక్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అది రాజకీయంగా దిలీప్ రాయ్కే గట్టి ఎదురుదెబ్బే అయినప్పటికీ... ఆ తర్వాత కూడా ఆయన నిలదొక్కుకోగలిగారు. బీజేపీ సాయంతో స్వతంత్ర రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా...
2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన దిలీప్ రాయ్... 2009లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2014లో బీజేపీ టికెట్పై రూర్కెలా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకు రెండు సంవత్సరాల ముందే వాజ్పేయి హయాంలో బొగ్గు కుంభకోణంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2018లో విజయ్ మోహపాత్రతో కలిసి దిలీప్ రాయ్ బీజేపీకి గుడ్బై చెప్పారు. పార్టీ తమను ఫర్నీచర్లా వాడుకుంటోందని ఆరోపించారు. దిలీప్ రాయ్ బీజేపీ నుంచి తప్పుకోవడం రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ పార్టీలో ఎదగడం దాదాపుగా ఏక కాలంలోనే జరిగాయి.బొగ్గు కుంభకోణంలో తనపై కేసు నమోదైన ఏడాదికే దిలీప్ బీజేపీని వీడారు. అప్పటినుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న దిలీప్ రాయ్ బీజేడీలో చేరబోతున్నట్లు 2019లో ఊహాగానాలు వినిపించాయి. సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో దిలీప్ రాయ్ ఆయనతో భేటీ అవడం ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. కానీ రాయ్ మాత్రం ఆ తర్వాత తన హోటల్ బిజినెస్కే పరిమితమై రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.