మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు షాక్.. ఎస్పీజీ భద్రత రద్దు.. Z+ ప్రొటెక్షన్..!
Recommended Video
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో రెండోసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.చిదంబరం అరెస్ట్కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణాస్త్రాలు గుప్పించారు. అదలావుంటే తాజాగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు SPG ప్రొటెక్షన్ తగ్గించడంపై మరింత భగ్గుమంటున్నారు.
మన్మోహన్ సింగ్కు షాక్.. ఎస్పీజీ ప్రొటెక్షన్ రద్దు
మన్మోహన్ సింగ్కు SPG ప్రొటెక్షన్ ( ప్రత్యేక భద్రతా బృందం ) వెనక్కి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎస్పీజీ భద్రత విషయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాతే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ మేరకు సోమవారం నాడు ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రత తగ్గించడానికి కారణాలున్నాయని.. భద్రతా ముప్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. సెక్యూరిటీ ఏజెన్సీల నివేదికల మేరకు ఆయనకు ఎస్పీజీ ప్రొటెక్షన్ తగ్గించినట్లు తెలిపింది. అయితే జడ్ ప్లస్ కేటగిరీ మాత్రం కొనసాగుతుందని పేర్కొంది.
మాజీ ప్రధానులకు ఎస్పీజీ ప్రొటెక్షన్ తగ్గించడం ఇదేమీ కొత్తకాదుగా..!
అదలావుంటే మాజీ ప్రధానులకు ఎస్పీజీ ప్రొటెక్షన్ తగ్గించడమనేది ఇదేమీ కొత్త కాదు. ఇదివరకు హెచ్డీ దేవెగౌడ, వీపీ సింగ్ విషయంలోనూ ఎస్పీజీ భద్రత వెనక్కి తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే అటల్ బిహారీ వాజ్పేయి విషయంలో మాత్రం కొంత ఊరట ఇచ్చారు. ఆయన మరణించేంత వరకు ఎస్పీజీ సెక్యూరిటీ కొనసాగించడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎస్పీజీ సెక్యూరిటీ అనేది ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో అమల్లోకి వచ్చింది.
2014 వరకు మన్మోహన్ సింగ్ భార్యా పిల్లలకు కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్..!
2014 వరకు మన్మోహన్ సింగ్ సతీమణి గురశరణ్ సింగ్ తో పాటు ఆయన కుమార్తెలకు కూడా ఎస్పీజీ భద్రత ఉండేది. అయితే తమకు తాముగా ఎస్పీజీ ప్రొటెక్షన్ అవసరం లేదంటూ వెనక్కి పంపించేశారు. అదలావుంటే తాజాగా మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రతను వెనక్కి తీసుకోవడంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు ఆయన సన్నిహితులు. అదలావుంటే ఇప్పుడు ఎస్పీజీ భద్రతా అనేది ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులకు మాత్రమే కొనసాగుతోంది.
మన్మోహన్కు ఎస్పీజీ తొలగింపుపై..!
పదేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా సేవలు అందించిన మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రత తొలగించడంపై కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన ఎస్పీజీ ప్రొటెక్షన్ విషయంలో పొలిటికల్ పగ సాధించడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని వాదిస్తున్నారు. మొన్నటికి మొన్న చిదంబరం అరెస్టులోనూ ఇలాగే దూకుడు వైఖరి అవలంభించారని.. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.