మన్మోహన్ సింగ్ హెచ్చరించారు: 2జి స్కామ్పై ప్రదీప్ బైజాల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై ట్రాయ్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ బైజాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2జీ స్కామ్ వ్యవహారంలో సహకరించకుంటే ఇబ్బందులు తప్పవంటూ తనను మన్మోహన్ సింగ్ హెచ్చరించారని ఆయన ఆరోపించారు. యుపీఏ ప్రభుత్వం తన ప్రతిష్టను దిగజార్చిందని ఆయన విమర్శించారు.
బైజాల్ రాసిన పుస్తకంలో అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తనలాంటి అధికారులు విచారణ ఎదుర్కోనడానికి ప్రధాన కారకులు మన్మోహన్ సింగేనని ఆయన ఆరోపించారు. టెలికాం మంత్రిగా దయానిధి మారన్ నియామకాన్ని వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. అయితే మన్మోహన్ పట్టించుకోలేదని ఆయన అన్నారు.
2జీ స్కామ్లో రతన్ టాటాను మాజీ మంత్రి అరుణ్ శౌరీని ఇరికించాలని తనను సీబీఐ కోరిందని బైజాల్ వెల్లడించారు. యుపిఐ 2 ప్రభుత్వంలో చాలా మంది తనను హెచ్చరించారని ఆయన చెప్పారు. తనపై, ఇతరులపై జరుగుతున్న విచారణలన్నీ చివరకి మన్మోహన్ సింగ్కే చుట్టుకుంటాయని, మంత్రులూ మంత్రిత్వ శాఖల చర్యలను ధ్రువీకరించారు కాబట్టి అది తప్పదని ఆయన అన్నారు.
దయానిధి మారన్, ఎ రాజా, బొగ్గు శాఖ మంత్రి చర్యలను ధ్రువీకరించింది మన్మోహన్ సింగేనని ఆయన అన్నారు. "ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ఇండియన్ రిఫార్మ్స్: 2జి, పవర్, ప్రైవేట్ ఎంటర్ ప్రైజెస్" అని తాను రాసిన పుస్తకంలో బైజాల్ ఆ విషయాలు చెప్పారు. ఎకనమిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ పుస్తకంలోని వివరాలను వెల్లడించాయి. సిబిఐని ప్రభుత్వాధికారులకు, రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడారని ఆయన ఆరోపించారు. సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనను బెదిరించారని కూడా ఆయన అన్నారు.