ఇందిరా గాంధీ షాక్: భారత మహిళలపై అసభ్య వ్యాఖ్యలు: నాటి అమెరికా అధ్యక్షుడి పైత్యం
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 1969 నుంచి 1974 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారీయన. రిపబ్లిక్ పార్టీకి చెందిన రిచర్డ్ నిక్సన్ తోపాటు అప్పటి జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్ కూడా భారతీయులపై చులకన వ్యాఖ్యలు చేశారు. ఆనాటి పరిస్థితుల్లో భారత్ అంటే అమెరికాకు పడేది కాదు. ఇందుకే ఆ దేశ నాటి నేతలు భారత్పై అక్కసు వెళ్లగక్కారు.
Recommended Video
ప్రపంచంలోనే అందవిహీనులు.. శృంగారమంటే తెలీదు
ఆ వివరాల్లోకి వెళితే..1971లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా వైఖరి మనదేశానికి అనుకూలంగా లేదు. పాక్కే మద్దతు ఇచ్చింది. అమెరికా ప్రయోజనాల కంటే జాతి వివక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు రిచర్డ్ నిక్సన్. భారత జాతిపై వారికున్న వ్యతిరేకత తాజాగా బయటపడిన టేపులతో మరోసారి వెలుగులోకి వచ్చాయి. 1971 జూన్లో వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో నిక్సన్ తోపాటు అప్పటి చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెచ్ఆర్ హాల్ట్మెన్లతో జరిగిన సమావేశంలో నిక్సన్ భారతీయ మహిళలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. భారతీయ మహిళలు ప్రపంచంలోనే అత్యంత అనాకర్షణీయమైనవారనడంలో సందేహం లేదు. శృంగారమంటే తెలియదు. అందవిహీనులు అని వ్యాఖ్యానించాడు.
భారత మహిళలు నచ్చరంటూ..
కాగా, 1971 నవంబర్ 4న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ వైట్ హౌస్లో నిక్సన్తో భేటీ అయ్యారు. అయితే, విరామ సమయంలో నిక్సన్.. కిసింజర్తో మాట్లాడుతూ.. మరోసారి భారత మహిళలపై అక్కసును వెళ్లగక్కారు. ‘భారత మహిళలు నాకు నచ్చరు. అసలు వారెవరికైనా నచ్చుతారా? చెప్పు హెన్రీ' అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. భారతీయ మహిళలతో శంగారమంటే ఇష్టమడనంటూ చెప్పుకొచ్చాడు. దీనికి కిసింజర్ అతని వ్యాఖ్యలకు మద్దతిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేశారు. అయితే, అతని సమాధానం కొంత అస్పష్టంగా ఉంది.
భారత మహిళలు పిల్లలు ఎలా కంటారో..
మరోసారి భారత్-పాక్ ఘర్షణలపై కిసింజర్, అప్పటి విదేశాంగ మంత్రి రోగెర్స్లతో చర్చిస్తున్నప్పుడు కూడా రిచర్డ్ మరోసారి భారత మహిళలపై నోరుపారేసుకున్నాడు. వారు పిల్లలను ఎలా కంటారో అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక బంగ్లా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడంపై మండిపడ్డ కిసింజర్.. భారతీయులు పాకిపనివారంటూ దుయ్యబట్టాడు. ఇది ఇలావుండగా, జాతి నిర్మూలనంటూ బంగ్లాదేశీయులను వధిస్తున్న పాక్ వైఖరిని తప్పుబట్టిన భారత్లో అమెరికా రాయబారి కెన్నెత్ కీటింగ్పైనా కిసింజర్ మండిపడ్డారు. ఇదంతా నిక్సన్ సమక్షంలోనే జరగడం గమనార్హం. మరో సందర్భంలో పొగడ్తలతో పనిచేయించుకుంటారని భారతీయులపై కిసింజర్ విమర్శించాడు. అంతేగాక, పాకిస్థాన్ వారు చాలా మంచివారంటూ వ్యాఖ్యలు చేశాడు.
న్యూయార్క్ టైమ్స్లో వ్యాసం..
కాగా, ఇంతవరకు రహస్యంగా ఉన్న ఈ టేపులను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ సేకరించారు. వీటిని క్రోడీకరించి న్యూయార్క్ టైమ్స్లో వ్యాసంలో రాశారు. నాటి అమెరికా అధ్యక్షులు అవలంభించిన జాతి వ్యతిరేక విధానాలు దేశంపై తీవ్ర ప్రభావం చూపాయని అన్నారు. చైనాతో స్నేహం కోసం అమెరికా నాడు పాకిస్థాన్కు మద్దతు పలకడం గమనార్హం. కాగా, నిక్సన్, కిసింజర్ వ్యాఖ్యలపై భారత నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరా గాంధీ భయడకపోవడంోతనే.. నిక్సన్ అలా..
నిక్సన్ అహంకారపూరిత వ్యాఖ్యలు, వైఖరి వల్లే ఆయన తన పదవిని పోగొట్టుకున్నారని భారత నేతలు మండిపడ్డారు. నిక్సన్ తక్కువ స్తాయి వ్యక్తి, ఇలాంటి ప్రవర్తన కారణంగానే వాటర్ గేట్ కుంభకోణంలో అభిశంసనకు గురై పదవి కోల్పోయాడని విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ధ్వజమెత్తారు. కాగా, బంగ్లాదేశీయులను ఊచకోత కోసిన పాక్కు మద్దతు ఇచ్చినందుకు 20ఏళ్ల తర్వాత కిసింజర్ క్షమాపణలు చెప్పారని తెలిపారు. నాటి అమెరికా చర్యలను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సమర్థవంతంగా తిప్పికొట్టారని చెప్పారు. ఇందిరా గాంధీ భయపడలేదన్న కారణంగానే నిక్సన్ నోరుపారేసుకున్నారని మణిశంకర్ అయ్యర్ తెలిపారు. యుద్ధంలో ఇందిరా గాంధీ సొంత పంథాలోనే విజయం సాధించడం అతనికి కోపం తెప్పించిందన్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే, అటు పాకిస్థాన్ తోనూ.. ఇటు చైనాతోనూ అమెరికాకు పడటంలేని విషయం తెలిసిందే.