ముందు పరీక్ష, ఆ తర్వాతే పెళ్ళి: చదువుపై యువతి శ్రద్ద
మైసూరు: కర్ణాటకలో ఓ నవ వధువు పెళ్ళి దుస్తుల్లో పరీక్షకు హజరైంది. పెళ్ళి ముహుర్తానికి ముందే పరీక్షను రాసి ముహుర్తం సమయానికి పెళ్ళీ పీటలపై కూర్చొంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన కావ్య అనే యువతి బీకాం సెకండియర్ చదువుతోంది. ఆమెకు లోహిత్ అనే యువకుడితో వివాహన్ని కుదిర్చారు. మే 10వ తేది ఉదయం 11 గంటలకు వివాహ ముహుర్తాన్ని నిర్ణయించారు.
అయితే అదే రోజున కావ్యకు బీకాం సెకండియర్ పరీక్షలున్నాయి. ఉదయం తొమ్మిదిగంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల షెడ్యూల్. అయితే పరీక్షలకు, వివాహనికి ఇబ్బంది లేకుండా తాను సమన్వయం చేసుకొంటానని వధువు రెండు కుటుంబాల వారిని ఒప్పించింది.
పెళ్ళి కూతురుగా ముస్తాబై పరీక్ష హల్కు వెళ్ళింది. అంతేకాదు 11 గంటల లోపుగా పరీక్ష రాసి పేపర్ ను ఇన్విజిలేటర్కు ఇచ్చేసింది. ఆ తర్వాత హడావుడిగా పెళ్ళి మండపానికి వచ్చింది. అనుకొన్న సమయానికి పెళ్ళి పీటలపై కూర్చొంది. నిర్ణీత సమయానికి ఆమె వివాహం పూర్తైంది. అంతేకాదు డిగ్రీ పూర్తి చేయాలని ఆమె కోరిక పట్ల పలువురు ఆమెను అభినందించారు.