పోటీ పడండి, కానీ పరీక్షలు లైఫ్ అండ్ డెత్కాదు: విద్యార్థులకు మోడీ
న్యూఢిల్లీ: పరీక్షలను ఆస్వాదించాలని, పోటీ పడాలని కానీ అవే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్లో విద్యార్థులకు ఉద్బోధ చేశారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తోటి విద్యార్థులతో పోల్చవద్దని, అది వారిని ఒత్తిడికి గురి చేస్తుందని సూచించారు. ఇప్పుడు పరీక్షల కాలం. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విద్యార్థులను ఉద్దేశించి మన్ కీ బాత్లో మాట్లాడారు.
పరీక్షల గురించి అనవసరంగా భయాలు పెట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. అత్మధైర్యంతో వాటిని ఎదుర్కోవాలన్నారు. కొంతమంది విద్యార్థులు పరీక్షలను జీవన్మరణ సమస్యగా భావిస్తూ అనవసరంగా ఒత్తిడికి గురవుతుంటారని, అయితే అలాంటి ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదన్నారు. మంచి మార్కులు తెచ్చుకోవడానికి విద్యార్థులు కష్టపడి చదవడం అవసరమే కానీ దానికోసం ఇతరులతో పోటీ పడడం సరికాదన్నారు.
చాలామంది విద్యార్థులు తమను ఇతరులతో పోల్చి చూసుకుంటారని, ఇదే ఒత్తిడికి కారణమవుతుందన్నారు. తాను కూడా సాధారణ విద్యార్థినేనని, పరీక్షల్లో సగటు మార్కులే వచ్చేవన్నారు. తన రైటింగ్ కూడా బాగా ఉండేది కాదన్నారు. తన రాత అర్థం కాక ఉపాధ్యాయులు పాస్ మార్కులు వేసేవారన్నారు. తమ పిల్లల మీద ఒత్తిడి తీసుకు రావద్దని మోడీ తల్లిదండ్రులకు కూడా హితవు పలికారు.
క్రితం సారికన్నా మంచిగా పరీక్షలు రాస్తానన్న కృతనిశ్చయంతో విద్యార్థులు పరీక్షల హాళ్లకు వెళ్లాలన్నారు. ఇతరులతో పోటీ పడే బదులు మీతో మీరే పోటీ పడండి, అప్పుడు మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారంటూ తన ప్రపంచ రికార్డును 35 సార్లు తానే బద్దలు కొట్టుకున్న మాజీ సోవియట్ యూనియన్ పోల్వాల్ట్ క్రీడాకారుడు సెర్గీ బుబ్కాను ఉదాహరణగా పేర్కొన్నారు.
బయటి విషయాల గురించి పట్టించుకోకండి, ఎందుకంటే మీలో ఆత్మవిశ్వాసం లేకపోవడానికి అది నిదర్శనం, మీరు అంధవిశ్వాసంలో పడిపోతారు, పరీక్షలే జీవితం కాదు, జీవితం పరీక్షలకన్నా ఎంతో పెద్దది అని ప్రధాని మోడీ విద్యార్థులకు హితబోధ చేశారు.
ప్రధాని మోడీ విద్యార్థులకు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో సూచనలిచ్చారు. ఒత్తిడిని జయించేందుకు మార్గాలు చెప్పారు. ‘‘మీరంతా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు కదా.. నేను మీ వెంటే ఉన్నాను. పరీక్ష పోతే అంతా పోతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ, అది తప్పు. టెన్షన్ పడొద్దు. ఒత్తిడి వద్దు. ఓ మంచి బ్యాట్స్మన్.. పడే బంతి గురించి ఆలోచిస్తాడు కానీ.. మ్యాచ్ గురించి కాదు.
కేవలం వర్తమానం గురించే ఆలోచిస్తాడు. లక్ష్యానికి సంకల్పం తోడైతేనే విజయం సిద్ధిస్తుంది. పరీక్ష రాసేటప్పుడు టెన్షన్ పడకుండా.. ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీరు మంచిగా ప్రయత్నిస్తే అది వృథా కాదు. సంతోషంగా ఉండండి. చిరునవ్వులతో పరీక్ష రాయండి.
మీరంతా బాగా పరీక్షలు బాగా రాస్తారని నాకు నమ్మకం ఉంది. మీ భవిష్యత్తు ఎంత బాగుంటే.. దేశం అంత దేదీప్యమానంగా వెలుగులీనుతుంది. తల్లిదండ్రులూ మీరు కూడా పిల్లలను ఒత్తిడికి గురిచేయొద్దు. ఇతరులతో పోల్చి చూడొద్దు'' అని ప్రధాని మోడీ సూచనలిచ్చారు.
కొంతమంది పరీక్ష రాసి బయటకు వచ్చాక తాము ఎలా రాశామో చూసుకునేందుకు చాలా సమయం వెచ్చిస్తారని, అది సరికాదని, ఆ సమయాన్ని రేపటి పరీక్ష కోసం ఉపయోగించాలని సూచించారు. బాలుర కంటే బాలికలు పరీక్షల్లో బాగా రాణిస్తుండటం గురించి మాట్లాడుతూ.. పరీక్షలు అనేసరికి బాలురు కొంత హైరానా పడతారని, వారి సోదరీమణులు మాత్రం పరీక్షల సమయంలోను ఇంట్లో అమ్మలకా సాయంపడుతూ రాణిస్తుంటారని కితాబిచ్చారు.