వ్యవసాయం,ఫార్మా రంగాలకు మినహాయింపు..నేడో రేపో లాక్ డౌన్ పొడిగింపుపై నిర్ణయం: మంత్రి కిషన్ రెడ్డి
ఊహించని ఉపద్రవంగా చైనా నుండి ఇండియాకు వచ్చిన కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది .దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో మార్చి 25 వ తేదీ నుంచి ఏప్రిల్ 14 వ తేదీ వరకు విధించిన లాక్ డౌన్ అందరికీ కష్టాలు తెచ్చి పెట్టింది. రవాణా సౌకర్యం లేక ఎక్కడికక్కడ పండిన పంటలు పొలాలకే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. ఇక అంతే కాదు లాక్ డౌన్ నేపధ్యంలో పరిశ్రమలు మూతపడటంతో మనకు కావలసిన అవసరాలకు కూడా ఉత్పత్తి లేకుండా పోయింది. ఇక మరో పక్క లాక్ డౌన్ కొనసాగింపుపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ విషయంపై కేంద్ర హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు .
కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోందని, ఈ సమయంలో లాక్ డౌన్ ను ఎత్తివేసినా, సడలించినా చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈరోజు ప్రధాని మోడీ, దేశంలోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారని పేర్కొన్న ఆయన ప్రధాని మోడీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారని, అయితే వ్యవసాయం, ఫార్మా రంగాలకు ఇప్పటికే లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు . రైతులు పంటలు మార్కెట్ కు తరలించటం , పంటను అమ్ముకోవడం వంటివి చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు . అయితే, ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూనే చేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు .
Recommended Video
ప్రస్తుతం దేశం ఉన్న తాజా పరిస్థితుల్లో మందుల అవసరం ఉందని , అందుకే ఫార్మా రంగానికి కూడా మినహాయింపు ఉన్నదని ఆయన పేర్కొన్నారు . అత్యవసర రంగాలకు చెందిన వాటిపై ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగానికి, ఫార్మా రంగానికి అలాగే నిత్యావసరాలు అందించే అన్ని వ్యవస్థలకు వెసులుబాటు ఉందని, ఎవరూ ఈ విషయం తెలియక ఇబ్బంది పడొద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు పండించిన పంటలను ధైర్యంగా అమ్ముకోండని పేర్కొన్నారు కిషన్ రెడ్డి . లాక్ డౌన్ విషయంలో ఈరోజు రాత్రికిగాని, రేపుగాని క్లారిటీ వస్తుందని, ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తారని ఆయన తెలిపారు. అయితే మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు రైతులు తమ పంటలను అమ్ముకునే పరిస్థితి లేదు . అటు ప్రభుత్వాలు చెప్తున్న దానికి ఇటు గ్రౌండ్ రియాలిటీకి చాలా వ్యత్యాసం ఉంది .