శబరిమల ఇష్యూ: కేరళ ప్రభుత్వం '3' వాదనలు, ట్విస్ట్ ఇచ్చిన ట్రావెన్కోర్ టెంపుల్ బోర్డు
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయ కేసు తీర్పును సమక్షించాలని దాదాపు అరవైకి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి. దీనిపై బుధవారం విచారణ ప్రారంభమైంది. దీనిపై ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట ఆయా న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రా ధర్మాసనంలో బుధవారం విచారణ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ), కేరళ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించాయి. కేరళ ప్రభుత్వం తరఫున అడ్వోకేట్ జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు. అసలు ఈ తీర్పు పైన రివ్యూ అవసరం లేదని కేరళ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆలయాల్లో మినహాయింపు హిందుత్వంలో మౌలిక సూత్రం కాదని చెప్పింది.
కేరళ ప్రభుత్వం చెప్పిన మూడు కారణాలు
ఇందులో సమీక్షించేందుకు ఏదీ లేదని కేరళ ప్రభుత్వం తరఫున లాయర్ తెలిపారు. లేదంటే మేం సమగ్రమైన వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. ఆర్టికల్ 26 ప్రకారం.. అయ్యప్ప స్వామి ఆలయం సాధారణ హిందువుల దేవాలయం అని పేర్కొన్నారు. కాబట్టి ఈ గుడిలోకి ఎవరు అయినా వెళ్లవచ్చునని చెప్పారు. 50 ఏళ్లకు పైబడిన మహిళలకు అవకాశం అంటే, కీలకమైన జీవితం అంతా అప్పటికే పూర్తవుతుందని పేర్కొన్నారు. చివరగా కేరళ హిందూ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అని పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదన్నారు. దీనిని కోర్టు గుర్తించిందన్నారు. ఓ ఆలయ సంప్రదాయాన్ని మొత్తం మతాచారంగా చెబితే చట్ట ప్రకారం చెల్లదన్నారు. దీనిని ఆధారంగా చేసుకునే తీర్పుపై రివ్యూ కోరడం సరికాదన్నారు. శబరిమల తీర్పుపై సమీక్ష అవసరం లేదన్నారు.
భర్తతో కలిసి ఉండే హక్కు ఉంది: శబరిమలలోకి వెళ్లిన కనకదుర్గపై విలేజ్ కోర్టు తీర్పు
ట్రావెన్ కోర్ దేవస్థానం తరఫున అభిషేక్ సింఘ్వీ
మరోవైపు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. హిందుత్వంలో ఒక్కో దేవుడికి ఒక్కో పూజా విధానం, సంప్రదాయాలు ఉంటాయని, అలాగే శబరిమల అయ్యప్ప స్వామికి కొన్ని సంప్రదాయాలున్నాయని. ఆర్టికల్ 17 ఇక్కడ ఏమాత్రం వర్తించదని, మత విశ్వాసాన్ని సైన్స్ మ్యూజియంగా చూడలేమని, మతవిశ్వాసాలకు సంబంధించిన విషయాల్లో రాజ్యంగా నిబంధనలను గుడ్డిగా అమలు చేయలేమని పేర్కొన్నారు. అదే సమయంలో ట్విస్ట్ ఇచ్చారు. మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు ఆదేశాలు పాటిస్తామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గతంలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించింది.
ఉద్యమకారులు మార్చలేరు
శతాబ్దాలుగా ఆలయ సంప్రదాయాలను మార్చాలా వద్దా అనే విషయాన్ని సంబంధిత వర్గం నిర్ణయిస్తుందని, కొందరు ఉద్యమకారులు దానిని నిర్ణయించలేరని, కొన్ని ఆచారాలను రూపుమాపడానికి ఇంతవరకు ఎటువంటి చట్టపరమైన శిక్షలు లేని నేపథ్యంలో కోర్టు ఈ అంశంలో తలదూర్చవద్దని సీనియర్ లాయర్ శేఖర్ నెఫడే పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం మహిళలకు శబరిమల ప్రవేశం కల్పించడం లేదని, ఇది అంటరానితనం కిందికి రాదని నాయర్ సర్వీస్ సొసైటీ తరఫు లాయర్ కె పరాశరణ్ అన్నారు. కాగా, అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై రివ్యూ చేయాలని అరవైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. సమయాభావం కారణంగా పిటిషనర్లందరి వాదనలు వినలేమని, కొన్ని వింటామని సుప్రీం కోర్టు బుధవారం తెలిపింది.