అర్నబ్ గోస్వామి సంచలన నిర్ణయం : 'టైమ్స్ నౌ'కు రాజీనామా!
ముంబై : ప్రఖ్యాత టౌమ్స్ చానెల్ ఎడిటర్, వ్యాఖ్యాత అర్నబ్ గోస్వామి టైమ్స్ నౌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించి సంచలనానికి తెరదీశారు. మంగళవారం సాయంత్రం తన రాజీనామా లేఖను టైమ్స్ నౌ యాజమాన్యానికి పంపించినట్టుగా తెలుస్తోంది.
దీనిపై స్పందించిన ఓ టౌమ్స్ ప్రతినిధి..'అర్నబ్ రాజీనామా చేశారు, మేమింకా బోర్డు మీటింగ్ లోనే ఉన్నాం, కానీ రాజీనామా వార్త నిజమే' అంటూ స్పష్టం చేశారు. టైమ్స్ నౌ యాజమాన్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అర్నబ్ తన రాజీనామా ప్రస్తావనను బోర్డుకు తెలిపినట్టు సమాచారం.
అర్నబ్ రాజీనామా వార్తల నేపథ్యంలో.. భవిష్యత్తులో ఆయన ఎటువైపు అడుగులు వేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెర మీదున్న ఊహాగానాల ప్రకారం.. త్వరలోనే ఆయన ఓ కొత్త న్యూస్ చానెల్ ను ఏర్పాటు చేయవచ్చునని తెలుస్తోంది. బీజేపీతో సత్సంబంధాలు కలిగిన పలు కార్పోరేట్ కంపెనీలతో కలిసి ఆయన కొత్త చానెల్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజీనామా విషయంపై పలువురు మీడియా ప్రతినిధులు అర్నబ్ ను సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుకూల వైఖరితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ పలువురు అర్నబ్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ప్రఖ్యాత ఎన్డీటీవీ ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ సైతం 'కుహానా జర్నలిస్ట్' అంటూ అర్నబ్ పై అప్పట్లో ఆరోపణలు చేశారు. అర్నబ్ లాంటి వ్యక్తులు ఉన్న రంగంలో కొనసాగుతున్నందుకు సిగ్గుపడుతున్నట్టుగా ప్రకటించారు. టౌమ్స్ నౌ యాజమాన్యాన్ని, అర్నబ్ ను గ్యాంగ్ ఆఫ్ మీడియా అంటూ దుయ్యబట్టారు.
కాగా, టౌమ్స్ నౌ ఎడిటర్ గా చానెల్ ను నంబర్.1 గా నిలబెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అర్నబ్. 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ అర్నబ్' 'న్యూస్ అవర్' వంటి కార్యక్రమాలతో చానెల్ రేటింగ్స్ ను పరుగులెత్తించారు. ముంబైలో 26/11 దాడులు జరిగినప్పుడు 100గంటల పాటు నిరంతరాయంగా వ్యాఖ్యానం అందించి చరిత్ర సృష్టించారు.