మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లతో బీజేపీ గాలం..స్పీకర్ను కూడా బుక్ చేశారు: కుమారస్వామి
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు పతాక స్థాయి చేరుకున్నాయి. దీని తీవ్రత ఆ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలపై పడింది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైన రెండురోజులు గడిచినప్పటికీ.. కాంగ్రెస్-జేడీఎస్ అధికార కూటమికి చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు బడ్జెట్ సమావేశాలకు వరుసగా డుమ్మా కొట్టారు. వారు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియరావట్లేదు. ఈ నలుగురిలో ఇద్దరు ముంబైలోని ఓ రిసార్ట్ లో ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీలో కూడా ఇలాంటి లుకలుకలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరయ్యారు.
ఇదిలావుండగా- కాంగ్రెస్-జేడీఎస్ అధికార కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ తన శాయశక్తులా ప్రయత్నిస్తోందనడానికి సరైన సాక్ష్యాధారాలు ప్రభుత్వం చేతికి చిక్కాయి. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్వయంగా జనతాదళ్ (ఎస్) శాసనసభ్యుడితో బేరాలు ఆడుతున్న ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆడియో టేపులను జేడీఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాగనగౌడ కుమారుడు శరణ గౌడ కూడా పాల్గొన్నారు.
జేడీఎస్ ఎమ్మెల్యే నాగనగౌడకు 50 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తూ, యడ్యూరప్ప మాట్లాడిన టేపులు అవి. కర్ణాటక-హైదరాబాద్ రీజియన్ పరిధిలోని యాద్గిర్ జిల్లా గుర్మిట్ కల్ స్థానానికి నాగనగౌడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ బహిరంగంగా కొనుగోలు చేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నాలకు ఇంతకుమించిన సాక్ష్యాధారాలు ఉండవని చెప్పారు. జేడీఎస్ నుంచి బయటికి వచ్చి, తమ పార్టీలో చేరితే 50 కోట్ల రూపాయలను ఇస్తామని స్వయానా ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బేరానికి పెట్టారని విమర్శించారు.
ఆపరేషన్ కమల విఫలమైందని, దీనితో తీవ్ర నిరాశచ నిస్పృహలకు లోనవుతున్న బీజేపీ నాయకులు నేరుగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని అన్నారు. కోట్ల రూపాయలను ఆశచూపి, వారిని ప్రలోభానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేనా మీ నీతి? అంటూ కుమారస్వామి నిలదీశారు. అనంతరం శరణగౌడ మాట్లాడుతూ బుధవారం రాత్రి తన తండ్రి నాగనగౌడకు బీజేపీ నాయకుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు దేవదుర్గకు రావాలని సూచించినట్లు చెప్పారు. దీనికి అనుగుణంగా తాను, తన తండ్రితో కలిసి దేవదుర్గకు వెళ్లామని వివరించారు. అక్కడికి వెళ్లిన తరువాత- దేవదుర్గకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శివనగౌడ నాయక్, హాసన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ తమను కలిశారని అన్నారు. తమ పార్టీలో చేరితే.. ఇప్పటికిప్పుడు తమకు 50 కోట్ల రూపాయలను ఇస్తామని బేరం పెట్టారని తెలిపారు.
కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం కూలిపోతే.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, తన తండ్రికి మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించినట్లు శరణ గౌడ తెలిపారు. స్పీకర్ అనర్హుడిగా ప్రకటిస్తే.. తన పరిస్థితేమిటని నాగనగౌడ అనుమానం వ్యక్తం చేయగా.. అదంతా తాము చూసుకుంటామని ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారని చెప్పారు. స్పీకర్ రమేష్ కుమార్ కు కూడా 50 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చి బుక్ చేశామని వివరించినట్లు తెలిపారు. పార్టీకి అండగా అమిత్ షా, నరేంద్రమోడీ ఉన్నారని, వారు న్యాయమూర్తులను కూడా బుక్ చేసుకోగలరని హామీ ఇచ్చినట్లు శరణ గౌడ విలేకరులకు వెల్లడించారు.